ఏపీలో 22వేలకుపైగా కొత్త కేసులు, భారీ పెరిగిన మరణాలు: 2లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 22,164 కరోనా కేసులు, 92 మరణాలు
తాజాగా నమోదైన 22,164 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 92 మంది మృతి చెందారు.గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరంలో 11 మంది, విశాఖపట్నంలో 10 మంది, తూర్పుగోదావరిలో 9 మంది, పశ్చిమగోదావరిలో 8 మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 8707కి చేరింది.
ఏపీలో లక్షా90వేలకుపైగా యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 18,832 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,88,264కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,90,632 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,73,67,935 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2844 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా ప్రకాశంలో 980 మంది కరోనా బారినపడ్డారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 2039, చిత్తూరులో 2169, తూర్పుగోదావరిలో 2844, గుంటూరులో 2099, కడపలో 1267, కృష్ణాలో 1240, కర్నూలులో 1568, నెల్లూరులో 1574, ప్రకాశంలో 980, శ్రీకాకుళంలో 1432, విశాఖపట్నంలో 2206, విజయనగరంలో 998, పశ్చిమగోదావరిలో 1748 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. గత బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలపాటు కర్ఫ్యూను అమలు చేస్తోంది.ఈ రెండు వారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు 49 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.