ఏపీలో కొత్తగా 24 కరోనా కేసులు ... 405కు పెరిగిన కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య
ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజా బులిటెన్ ప్రకారం మొత్తం ఇప్పటి వరకు 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటికే పలు జిల్లాలలో 133 ప్రాంతాలలో రెడ్ జోన్లు ప్రకటించి ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. ఇక అంతే కాదు మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు . దేశ వ్యాప్తంగా కరోనాను నియంత్రించటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనా నివారణకు కష్టపడుతున్నా కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతున్న తీరు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది .
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వరుసగా పెరుగుతూనే వున్నాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా 24 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు . గుంటూరులో 17 , కర్నూల్ లో 5 , ప్రకాశం, కడప జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు వెల్లడించారు. మొత్తం 24 కొత్త కేసులు నమోదైనట్టు అధికారికంగా తెలిపారు .ఇక మొత్తం కేసుల సంఖ్య 405 కి చేరింది. ఆస్పత్రుల నుంచి 11 మంది కోలుకున్న కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు . ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్టు తెలిపారు. ప్రస్తుతం 388 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోందనటానికి రోజు రోజుకూ పెరుగుతున్న కేసులే ఉదాహరణ . రాష్ట్రంలో గంటగంటకూ ఒక్కో పాజిటివ్ కేసు బయటపడుతూనే ఉంది. కేవలం 20 గంటల్లో 24 కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం మినహా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 11 జిల్లాల్లో 133 ప్రాంతాలను ప్రభుత్వం రెడ్జోన్లుగా గుర్తించింది. వీటిలో అత్యధికంగా నెల్లూరులో 30 ఉండగా, ఆ తర్వాత కర్నూలులో 22, కృష్ణాలో 16 ప్రాంతాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 3మాత్రమే ఉన్నాయి. ఇక్కడ లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.