ఎపిలో 25 లక్షల దొంగ ఓట్లు...రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ ఏకంగా హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్న నేపథ్యంలో ఎపి ఎన్నికల కమీషన్ సంచలన ప్రకటన చేసింది.
రాష్ట్రంలో అనుమాస్పదమైన ఓట్లు కలిగిన వారు 25.47 లక్షల మంది ఉన్నట్లు ఎపి ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్. పి.సిసోడియా జిల్లాలవారీగా అలా నమోదైవున్నఅనుమానిత ఓటర్ల జాబితాను సైతం విడుదలచేయడం జరిగింది. ఈ బోగస్ ఓటర్లలో ఎక్కువమంది రాయలసీమ జిల్లాల్లోనే ఉన్నట్లుగా గుర్తించినట్లు సిసోడియా చెప్పడం గమనార్హం.
ఇలా అనుమానిత ఓటర్లు ఎక్కువగా నమోదైఉన్న జిల్లాల్లో తొలి మూడు స్థానాల్లో అనంతపురం,చిత్తూరు,విజయనగరం ఉన్నాయి. జిల్లాలవారీగా బోగస్ ఓటర్ల సంఖ్యలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో 3,55,819...చిత్తూరులో 3,42,961...కర్నూలులో 3,13,032...శ్రీకాకుళం జిల్లాలో 1,23,233...విజయనగరంలో 1,10,036...విశాఖలో 2,00,767 అనుమానాస్పద ఓటర్లు ఉన్నారు.
ఇక తూర్పుగోదావరిలో 1,24,085...కృష్ణాలో 1,12,555...గుంటూరులో 2,07,209...ప్రకాశంలో 1,41,812...నెల్లూరులో 2,19,763...కడపలో 91,377 మంది ఓటర్లు జాబితా అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్. పి.సిసోడియా వివరించారు.
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లకు స్థానం కల్పిస్తున్నారని పేర్కొంటూ దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితా నుంచి అనర్హులైన నకిలీ ఓటర్లను తొలగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైకోర్టులో ఈ పిల్ ను దాఖలు చేశారు.