అధికారంలోకి వస్తే ఏపీలో 25 జిల్లాలు: కేసీఆర్ దారిలో జగన్, ఈనాడు పేపర్లో ఏం చూసినా అదే
ఇచ్ఛాపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సంచలన ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వచ్చాక వ్యవస్థను మార్చుతానని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని ప్రకటన చేశారు.
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాలుగా మార్చారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. తన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జరిగిన సభలో మాట్లాడారు.
ఇచ్చాఫురంలో పైలాన్ ఆవిష్కరణ: భానుచందర్ను పార్టీలోకి ఆహ్వానించిన జగన్
చిలుగా గోరింకలు సిగ్గుతో తలదించుకునేలా
ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనేక మాటలు మార్చారని జగన్ అన్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి ఉన్నారని, టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నారని, అప్పుడు బీజేపీని పొగుడుతారని, అసెంబ్లీలో బీజేపీని ప్రశంసిస్తూ తీర్మానం చేస్తారని, నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేసి ఎన్నికలకు ముందు మళ్లీ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా సంజీవినా అని అడిగారని, హోదా అడిగిన మనలను వెటకారం చేశారని, బీజేపీ ఏపీకి చేసినంతగా ఏ రాష్ట్రానికి చేయలేదని చెబుతారని, ఈ నాలుగేళ్లు టీడీపీ, బీజేపీల తీరు చూసి చిలుకా గోరింకలు కూడా సిగ్గుతో తలదించుకునేలా ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబుకు ప్రత్యేక హోదా సహా అన్నీ గుర్తుకు వస్తాయన్నారు.
ఈనాడు పేపర్లో చూస్తే అదే
ఈనాడు పేపర్లో ఈ మధ్య ఏ రోజు చూసినా చంద్రబాబుకు, మోడీకి యుద్ధం అని ఉంటుందని, నాలుగేళ్లు బీజేపీతో చిలుకా గోరింకల్లా కాపురం చేసి, ఇప్పుడు యుద్ధంలా కనిపిస్తోందా అని జగన్ మండిపడ్డారు. మీడియాను మేనేజ్ చేస్తున్నారన్నారు. రెండు పత్రికలు, అనేక టీవీ ఛానళ్లను అడ్డుపెట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలని చెప్పారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం జగన్ ఒక్కడి వల్లకాదని, మీ అందరి సహకారం కావాలని చెప్పారు. రేపు దేవుడు ఆశీర్వదించి, మీ ఆందరీ దీవెనలతో మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలో ప్రక్షాళన చేస్తామని జగన్ చెప్పారు.
ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తా
తాము అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంటును ఓ జిల్లాగా చేస్తానని జగన్ సంచలన ప్రకటన చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తానని చెప్పారు. 25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తానని చెప్పారు. పంచాయతీలను బలోపేతం చేస్తానని అన్నారు. కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేస్తానని చెప్పారు. ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం తీసుకు వస్తానని చెప్పారు.
రైతులకు ఏం చేస్తామంటే
ప్రతి రైతుకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పారు. రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ.12,500 పెట్టుబడి నేరుగా ఇస్తామని చెప్పారు. రైతుల సాగు ఖర్చుల తగ్గింపు, పెట్టుబడి సాయంపై పలు హామీలు ఇచ్చారు. రైతులకు బోర్లను ఉచితంగా వేయిస్తామని చెప్పారు. రైతులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. బీమా సొమ్మును రైతు కుటుంబాలకు చేర్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు. పంట వేసేటప్పుడే ధరలు నిర్ణయిస్తామని చెప్పారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సహకార డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు బోనస్గా రూ.4 ఇస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కోసం రూ.4వేల కోట్ల ఫండ్ పెడతామని చెప్పారు. మనం రూ.2 వేల కోట్లు పెడితే కేంద్రం మరో రూ.2వేల కోట్లు పెడుతుందని చెప్పారు. మొత్తం రూ.4వేల కోట్లు అవుతుందన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. మీ గ్రామంలోనే యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేస్తామన్నారు. రైతులకు అనుకోని విధంగా ఏమైనా జరిగితే వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం తాము అధికారంలోకి రాగానే చట్టం చేస్తామన్నారు. ఈ రూ.5 లక్షలు కేవలం కుటుంబానికే ఉపయోగపడేలా.. ఈ నిధిపై అప్పుల వారికి హక్కు లేనివిధంగా చేస్తామన్నారు. ప్రతి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.