ఏపీలో ఉచిత హెల్త్ ఏటిఎంలు: వ్యాధి చెబితే మాత్రలు ఇస్తాయి!
విజయవాడ: సాధారణంగా ఏటీఎంలు అంటే డెబిట్ కార్డుతో నగదు డ్రా చేసుకుంటామన్న విషయమే అందరికీ తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో డబ్బు చెల్లిస్తే.. కూల్ డ్రింక్స్, తినుబండారాలు, పాల, నీళ్ల ప్యాకెట్లు ఉంటాయని కొందరికి తెలుసు. కాగా, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ముందడుగు వేయనుంది.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల వైద్య సేవలను మరింత మెరుగుపరిచే దిశగా హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 25 హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కొద్ది సేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరు జిల్లాలో ఒకటి, మిగిలిన అన్ని జిల్లాల్లో రెండు చొప్పున వీటిని సత్వరమే ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ఏటీఎం సెంటర్లలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఔషధాలు లభిస్తాయి. తలనొప్పి, మధుమేహం, జ్వరం వంటి రోగాలకు ఔషధాలు ఒక్క క్లిక్ తో లభిస్తాయి.
వాస్తవానికి హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని మార్చిలోనే కేంద్రం నిర్ణయించింది. వీటి ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నది నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.
హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా వీటిల్లో ఔషధాలను నింపుతారు. ఒకవేళ రుగ్మత అధికంగా ఉంటే, ఏటీఎం మెషీన్ ద్వారానే సమీపంలోని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చేందుకు కూడా వీలుంటుంది.
కాగా, నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసెర్చ్ సెంటర్ ఈ మెషీన్లను తయారు చేస్తోంది. అన్ని సక్రమంగా జరిగితే ఈ స్కీమ్ విజయవంతమై అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఉచితంగా ఏటీఎంల ద్వారా మందులు లభించనున్నాయి.