అమరావతి దీక్షల బాధ్యత ఇక రాష్ట్ర ప్రజలదే: జగన్ సర్కార్ అరుదైనదిగా: తేల్చి చెప్పిన చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవంక తన ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తుండగా.. మరోవంక- అమరావతి పరిరక్షణ సమితి నిరసన దీక్షలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 250 రోజులకు చేరుకున్నాయి. మున్ముందూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీడీపీ సారథ్యంలో..
అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు, వ్యతిరేక ప్రదర్శనలకు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వహిస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా కొంతకాలం పాటు అమరావతి పరిరక్షణ సమితి ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఒకరోజంతా నిరసన దీక్షకు దిగారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్న తరువాత.. బీజేపీ క్రమంగా ఈ ఉద్యమానికి దూరమౌతూ వచ్చింది.
అమరావతి ఆందోళనల గొప్పదనం అదే..
అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నాయకులందరూ ముందు నుంచీ అండగా ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తూ వచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలు 250వ రోజులకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో దాని గొప్పదనాన్ని చంద్రబాబు వివరించారు. కొద్దిసేపటి కిందట వరుసగా ట్వీట్లను సంధించారు. అదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా ఘాటు విమర్శలు చేశారు. చురకలు అంటించారు.
అత్యంత అరుదుగా..
అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 250 రోజులు నిండాయని చంద్రబాబు అన్నారు. దేశ చరిత్రలో ఇంత కాలం పాటు, సుదీర్ఘంగా కొనసాగిన ఉద్యమాలు చాలా అరుదుగా చోటు చేసుకున్నాయని చెప్పారు. 250 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారని, అయినప్పటికీ.. ప్రభుత్వం ఏనాడూ దానిపై దృష్టి సారించలేదని అన్నారు. రైతులతో చర్చల కోసం ముందుకు రాలేదని విమర్శించారు. ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు కూడా అరుదేనని ఎద్దేవా చేశారు. పైగా వేలాది మంది ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపిందని ఆరోపించారు.
85 మంది రైతులు అమరులు..
అమరావతిని రాజధానిగా కొనసాగింపజేసే ప్రయత్నంలో ఈ 250 రోజుల కాలంలో 85 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులు అయ్యారని చంద్రబాబు అన్నారు. ఇంతమంది ప్రాణత్యాగాలను చేసినప్పటికీ.. ప్రభుత్వం తమాషా చూస్తూ కాలం గడిపిందని మండిపడ్డారు. రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న తమ డిమాండ్కు వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తీసుకున్న మూడు ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టేనని దీనితో స్పష్టమైందని అన్నారు. అలాంటప్పుడు మొండిగా ముందుకు పోవడం నిరంకుశత్వమే అవుతుందని ధ్వజమెత్తారు.
Recommended Video
13 వేల గ్రామాల పవిత్ర మట్టి..
అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, మూడు వేల వార్డుల నుంచి సేకరించిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలు వినియోగించామని చంద్రబాబు గుర్తు చేశారు. తన హయాంలో ప్రతి గ్రామం కూడా అమరావతి నిర్మాణానికి సహకరించిందని, ప్రజలు అంగీకరించారని అన్నారు. మట్టిని, పవిత్ర జలాలను ప్రజలు ఊరేగింపుగా తీసుకొచ్చి, తమ అనుమతిని తెలియజేశారని చంద్రబాబు చెప్పారు. అందరి ఆమోదంతోనే తాము అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని అన్నారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత 13 జిల్లాల ప్రజలపై ఉందని అన్నారు.