ఏపీ హైకోర్టును కమ్మేసిన కరోనా: 26 మందికి పాజిటివ్: ఆందోళన: ఫ్రంట్లైన్ వారియర్లుగా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ వందల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే పోతోంది. కృష్ణాజిల్లాలో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. ఇప్పటికే ఈ జిల్లాలో 1594 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే 67 మందిని బలి తీసుకుంది ఈ వైరస్. 898 మంది వైరస్ బారిన పడ్డారు. 629 మంది డిశ్చార్జి అయ్యారు.
కరోనా కల్లోలం హైకోర్టును కూడా కమ్మేసింది. హైకోర్టులో పని చేస్తోన్న 26 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ మరణం అనంతరం.. ఉద్యోగులందరికీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం వారం రోజుల పాటు కార్యకలాపాలను కూడా రద్దు చేశారు. ఉద్యోగులందరికీ కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా 26 మంది పాజిటివ్గా తేలారు. వారిలో సగంమందికి పైగా అసింప్టోమేటిక్ అని తెలుస్తోంది. వారిలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని సమాచారం.
ఉద్యోగులందరికీ నిర్వహించిన పరీక్షల సందర్భంగా మాత్రమే వారి శాంపిళ్లలో వైరస్ కనిపించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ 26 మంది ఉద్యోగులు హోం ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి వ్యక్తిగతంగా వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు వారికి చికిత్సను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ డాక్టర్ల బృందాన్ని సైతం నియమించిందని సమాచారం.
మరో స్టార్ను కోల్పోయిన ఫిల్మ్ ఇండస్ట్రీ: వెంటాడుతోన్న మరణాలు: గుండెపోటుతో ఆమె కన్నుమూత
Recommended Video
హైకోర్టు ఉద్యోగులు ఫ్రంట్లైన్ వర్కర్లుగా విధులను నిర్వర్తిస్తున్నారని ఇన్ఛార్జి రిజిస్ట్రార్ గంధం సునీత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. జ్యుడీషియల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించేలా ప్రభుత్వానికి సూచించాలని పేర్కొన్నారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, మున్సిపల్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు పోలీసుల తరహాలో జ్యుడీషియల్ సిబ్బంది కూడా ఫ్రంట్లైన్ వర్కర్లేనని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జ్యుడీషియల్ విభాగం తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు. వారికి సరైన వైద్య సదుపాయాన్ని, రక్షణను కల్పించాలని విజ్ఙప్తి చేశారు.