'తొక్కిసలాటను రాజకీయం చేయొద్దు', 'బాబు వల్లే 27 మంది మృతి'
హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాల్లో భాగంగా రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటను రాజకీయం చేయడం తగదని ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తొక్కిసలాటపై విచారణకు ఆదేశించామని నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ఆరోపించారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో జరిగిన కృష్ణా పుస్కరాల్లో నలుగురు మరణించారని అంతమాత్రాన వైయస్ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల నుంచి మంచి సలహాలు వస్తే పాటించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాజమండ్రిలో కోటగుమ్మం పుష్కరఘాట్ ఘటనలో మృతిచెందిన రాజేశ్వరి కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అలసత్వం వల్లే 27 మంది మృత్యువాత పడ్డారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.