అన్నవరంలో కరోనా కలకలం... మరో 29 మంది సిబ్బందికి పాజిటివ్...
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కరోనా కలకలం రేపుతోంది. అన్నవరంలోని శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మరో 29 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. శనివారం(అగస్టు 8) మొత్తం 300 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా... 29మందికి పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఇప్పటివరకూ వైరస్ బారినపడినవారి సంఖ్య 39కి చేరింది. అంతకుముందే 10 మంది అర్చకులు,సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.
అన్నవరం గ్రామంలోనూ ఇప్పటికే 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కలకలం నేపథ్యంలో ఈ నెల 14వరకూ దర్శనాలు,వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. స్వామి వారికి ఏకాంత నిత్య సేవలు నిర్వహిస్తామని పేర్కొంది.
ఇటీవల టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్విమ్స్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అప్పటినుంచి టీటీడీ అర్చకుల్లోనూ ఆందోళన మొదలైంది. దీనిపై పలువురు అర్చకులు గోవింద నిలయంలో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితోనూ చర్చించినట్లు సమాచారం. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్వామి వారి కల్యాణోత్సవ సేవను ఈ నెల 31 వరకూ నిలిపివేయాలని అర్చకులు డాలర్ శేషాద్రికి సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తరుచూ 10వేల మార్క్ని తాకుతోంది. వరుసగా 3 రోజుల నుంచి 10వేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే కొత్తగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. కరోనాతో మరో 97 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1939కి చేరింది.