మూడు రాజధానులు మంచిదే, రాజధానితో 10 శాతం ప్రజలకే మేలు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మార్పుపై ఏపీలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. గత 15 రోజులుగా రైతులు, టీడీపీ శ్రేణులు ఆందోళనతో కదం తొక్కాయి. మరోవైపు రాజధాని మార్పు గురించి మంత్రులు తలో మాట అంటున్నారు. మూడు రాజధానుల ఆలోచన మంచిదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజధానితో 10 శాతం ప్రజలకే మేలు జరుగుతుందని చెప్పారు.
10 శాతమే..
రాజధానిలో ఎక్కువలో ఎక్కువ పది శాతం మంది ప్రజలకే పని ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. మిగిలిన 90 శాతం ప్రజలు మమూలేనని చెప్పారు. కోర్టు విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పారు. మూడు రాజధానుల వద్ద అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందని చెప్పారు. రాజధాని మార్పు వద్దనేది అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారేనని గుర్తుచేశారు. సీఎం జగన్ ప్రతిపాదనను వారే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎంకు థాంక్స్..
రాజధాని మార్పుకు సంబంధించి రాయలసీమ వాసులంతా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపాలని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 90 శాతం ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారని తెలిపారు. కానీ వారు అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టిసారించలేదని తెలిపారు. దీంతో సమస్య ఏర్పడిందని.. ఇప్పుడు జగన్ ప్రతిపాదనతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
బంగారుబాతు..
ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ బంగారుబాతుగా మారిందని చెప్పారు. హైదరాబాద్ నుంచే 50 నుంచి 65 శాతం ఆదాయం వస్తోందని తెలిపారు. రాజధానిపై సీఎం జగన్ ప్రతిపాదన సముచితం అని ఉద్ఘాటించారు. రాజధానిపై హై పవర్ కమిటీ వేశారని, 20 రోజుల్లో నివేదిక అందజేస్తోందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ జరిపి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇబ్బందే కానీ..
రాయలసీమలో హైకోర్టు ఉంటే ఉత్తరాంధ్ర వారికి ఇబ్బంది అని, అలాగే విశాఖలో సచివాలయంలో ఉండటంతో ఇబ్బంది ఉంటుందని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం రాజధానిపై కాలయాపన చేసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల రాజధానిని ప్రకటించలేదని మండిపడ్డారు. తొలుత నూజివీడు అని తర్వాత గుంటూరు అని చెప్పి కాలం వెళ్లదీశారని పేర్కొన్నారు.
భూముల రిజిష్ట్రేషన్ చేశాక..
అమరావతి పరిసరాల్లో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బంధువులు, స్నేహితులు భూములు కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తయ్యాక రాజధానిని ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపంచారు. ఐదేళ్లలో 5 వేల కోట్ల పనలు చేస్తు లక్షా 5 వేల కోట్లు ఎప్పుడూ వ్యయం చేసి,, రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు.