తిరుమలలో ఆధ్యాత్మిక సౌరభం ఆరంభం: శ్రీవారికి జ్యేష్టాభిషేకం: గోవిందుడి నామస్మరణతో
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో ఆధ్యాత్మిక సౌరభం క్రమంగా వెల్లివిరిస్తోంది. గోవిందుడి నామస్మరణ ఏడుకొండలు మారుమోగుతున్నాయి. సాక్షాత్ శ్రీమహావిష్ణువు రూపమైన వేంకటేశ్వరుడికి మూడురోజుల పాటు నిర్వహించే జ్యేష్టాభిషేకం ఆరంభమైంది. గురువారం ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా ఆరంభించారు అర్చకులు. శనివారం ఈ అభిషేకోత్సవం ముగుస్తుంది. ఆదివారం ఒక్కరోజే వ్యవధి ఉంటుంది. సోమవారం నుంచి శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోబోతున్నాయి.
శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం: ఏడుకొండలవాడి తొలి దర్శన భాగ్యం వారికే: త్వరలో ఆన్లైన్
తిరుమంజనంతో ఆరంభం..
జ్యేష్టాభిషేకం ప్రారంభం సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం లాంఛనంగా ఈ కార్యక్రమం ఆరంభమైంది. జ్యేష్టాభిషేకంలో భాగంగా ఋత్విక్కులు యాగశాలలో శాంతి హోమాన్ని నిర్వహించారు. శత కలశ ప్రతిష్ఠ ఆవాహన, నవ కలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ ఆవాహనాన్ని చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఉత్సవ మూర్తులకు అభిషేకం..
ఉత్సవ సమయాలో మలయప్ప స్వామి వారి విగ్రహాన్నే ఊరేగిస్తుంటారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయరు, చిన్నజీయరు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, సంయుక్త కార్యనిర్వహణాధికారిణి భార్గవి,, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
8 నుంచి ట్రయల్ రన్
జ్యేష్టాభిషేకాం ఆరంభమైన అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు దాదాపు 75 రోజులుగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేశామని, ఆలయంలో స్వామివారి కైంకర్యాలు ఆగమోక్తంగా అర్చక స్వాములు ఏకాంతంగా నిర్వహించారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి మేరకు ముందు జాగ్రత్త చర్యలను అమలు చేస్తూ సోమవారం నుంచి తిరుమలలో ప్రయోగాత్మకంగా దర్శనం ప్రారంభిచాలని నిర్ణయించామని అన్నారు.
ముందుజాగ్రత్తల కోసం
తిరుమలకు విచ్చేసే భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాల్సి ఉంటుందనే విషయంపై ఇదివరకే మార్గదర్శకాలను సిద్ధం చేశామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తుల రవాణా, నివాస వసతి, లడ్డూ ప్రసాదాల వితరణ, తలనీలాల సమర్పణ, శానిటైజేషన్ తదితర అంశాలపై విభాగాల వారిగా అధికారులతో చర్చించినట్లు తెలిపారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ గంటకి ఎంత మందికి దర్శనం కల్పించవచ్చనే దిశగా ట్రయల్ రన్ కొనసాగుతుందని చెప్పారు. దీనికి అనుగుణంగా తిరుమలలో రోజూ ఎంతమంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామనేది నిర్ధారిస్తామని అన్నారు.
Recommended Video
దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతించిన టీటీడీ
తిరుమలలో దుకాణాలను తెరచుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతి ఇచ్చారు. సోమవారం నుంచి దుకాణాలు తెరచుకోవచ్చని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఒక్కో దుకాణంలో ఇద్దరికి మాత్రమే ఉండాలని సూచించారు. దుకాణాల వద్ద భక్తులు ఆరు అడుగుల మేర భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద కూడా శానిటైజర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అన్నారు.