అచ్చెన్న అరెస్టులో మరో అడుగు: మూడు రోజుల ఏసీబీ కస్టడీ: జీజీహెచ్ లేదా: బెయిల్ పిటీషన్పై
గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపలను సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి విచారణ ఇక ఆరంభం కాబోతోంది. ఆయనను విచారించడానికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకోవడానికి ఏసీబీ అధికారులకు న్యాయస్థానం అనుమతిని మంజూరు చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో ఈ విచారణ కొనసాగుతుంది.
డొక్కా మాణిక్య వరప్రసాద్తో వైసీపీ బోణీ: రేసులో లేని టీడీపీ: మండలి ఇక ఏకపక్షమే: కాస్సేపట్లో
జీజీహెచ్లో చికిత్స
అరెస్టయిన తరువాత అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. అరెస్టు కావడానికి కొద్దిరోజుల ముందే ఆయనకు శస్త్రచికిత్సను నిర్వహించారు. అది కాస్తా తిరగబెట్టడంతో ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను విచారించడానికి న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏసీబీ అధికారులు ఆయనను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ విచారణ గుంటూరు జీజీహెచ్లోనే కొనసాగిస్తారా? లేక ఆయనను జైలుకు తరలిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
న్యాయవాదుల సమక్షంలో ఆసుపత్రిలోనే..
అచ్చెన్నాయుడికి అందించాల్సిన వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయనను ఆసుపత్రిలోనే విచారించడానికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ కొనసాగేలా ఏసీబీ అధికారులు సమాయాత్తమౌతున్నట్లు తెలుస్తోంది. ఆయనను గుంటూరు లేదా వేరే ప్రాంతాల్లోని కారాగారాలకు తరలించాలని మొదట భావించినప్పటికీ.. వైద్య అవసరాల కోసం మళ్లీ ఆసుపత్రికి తీసుకుని రావాల్సిన అవసరం ఏర్పడ వచ్చని, అందుకే జీజీహెచ్లోనే ప్రత్యేక గదిలో, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బెయిల్ పిటీషన్ కొట్టివేత..
అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటీషన్ను ఏసీబీ న్యాయస్థానం కొట్టేసింది. నిందితుడు రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు చేయడానికి అవకాశం ఉందంటూ ఏసీబీ తరఫు న్యాయవాది అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పైగా నిందితుడి విచారణ ఇంకా ప్రారంభదశలోనే ఉందని పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ఏసీబీ న్యాయమూర్తుల.. బెయిల్ పిటీషన్ను కొట్టేశారు. విచారణ ఇంకా ప్రారంభదశలోనే ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు.
Recommended Video
డిశ్చార్జి చేస్తారంటూ
అచ్చెన్నాయుడిని డిశ్చార్జి చేసే అవకాశం ఉందంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏసీబీ న్యాయస్థానం ఆసుపత్రిలోనే విచారణ కొనసాగించడానికి అనుమతి ఇచ్చిందని వారు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఆసుపత్రి డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడిని తీసుకొస్తోందని, అచ్చెన్నాయుడిని వెంటనే డిశ్చార్జి చేయాలంటూ పోలీసుల ద్వారా ప్రయత్నాలను సాగిస్తోందని ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందని అంటున్నారు.