ఏపీలో కరోనా బారిన ఐఎఎస్లు: సీఎంఓలో కీలక అధికారికీ: జగన్ నేరుగా పర్యవేక్షించే శాఖలకు చీఫ్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకూ అదుపులోనే ఉన్నట్టు కనిపించిన ఈ వైరస్.. ఇటీవలి కాలంలో రెక్కలు చాచింది. అత్యంత ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. రోజూ వందల సంఖ్యలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి- లాక్డౌన్ నిబంధనలను సడలించిన తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సామాన్యులనే కాదు.. ప్రముఖులనూ వదలట్లేదు.
ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావు, కర్నూలు జిల్లా కోడుమూరు శాసససభ్యుడు సుధాకర్ వైరస్ బారిన పడ్డారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్నశ్రీను వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. మరో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడూ వైరస్ బాధితుడు అయ్యాడు.
తాజాగా.. ముగ్గురు ఐఎఎస్ అధికారులు కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురూ రాష్ట్ర ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడినప్పటికీ.. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని సమాచారం. అసింప్టోమేటిక్గా వారిని నిర్ధారించారు. ర్యాండమ్గా వారికి ట్రూనాట్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురే కాకుండా మరో ఇద్దరు మహిళా ఐఎఎస్ అధికారులకు కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కొద్దిరోజులుగా వారంతా విధులకు హాజరు కావట్లేదు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన సెలవుల్లో ఉన్నారు. సచివాలయం కేంద్రంగా పనిచేసే ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ కరోనా వైరస్ వ్యాప్తిచెందడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. సచివాలయ ఉద్యోగుల్లో కరోనా లక్షణాలు కనిపించడం కొత్తేమీ కాదు. ఇదివరకు సుమారు 15 మంది వరకు వేర్వేరు శాఖల్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులు కరోనా వల్ల అనారోగ్యానికి గురయ్యారు.
ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కరోనా బారిన పడటం ఇది రెండోసారి. లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తరువాత సందర్శకుల తాకిడి పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక శాఖలను పర్యవేక్షించే అధికారి దీని బారిన పడటం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేరుగా సంబంధాలను కలిగి ఉన్న అధికారి కావడం వల్ల ఆందోళన వ్యక్తమౌతోంది. కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇటీవలే ఆయనను కలిశారని అంటున్నారు.