పిడుగుపాటే యమపాశంగా మారి ముగ్గురు విద్యార్థులు మృతి...క్రికెట్ ఆడుతూనే!
గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ పై వేలాది పిడుగులు విరుచుకు పడగా వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.
మరోవైపు గుంటూరు జిల్లాలో వారం కిందటే పిడుగుల కారణంగా 9 మంది మృత్యువాతన పడిన ఘటన మరువకముందే రోజుల వ్యవధిలోనే జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. సోమవారం వేసవి సెలవులంటూ ఆనందంగా క్రికెట్ ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు పిడుగుపాటుకు గ్రౌండ్ లోనే కుప్పకూలిన ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే..
గురజాల మండలం సమాధానంపేటలోని మైదానంలో వేసవి సెలవులు కావడంతో పిల్లలంతా చేరి సందోహంగా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో ఉన్నట్లుండి కొంచెం వాతావరణం మారింది...చిన్నగా వర్షం తుంపరులు మొదలయ్యాయి. ఆట మధ్యలో ఉన్న చిన్నారులు ఆ వర్షం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా పెళ పెళ మంటూ భారీ శబ్దం. భూకంపం వచ్చినట్లుగా నేల కదిలిన పరిస్థితి. కాసేపటిదాకా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి...
ఆ తరువాత పిల్లలందరూ ఆ అనూహ్య ప్రభావం నుంచి తేరుకుని చూసేసరికి గ్రౌండ్ లో మొత్తం నలుగురు విద్యార్థులులోపు ముగ్గురు కిందపడిపోయారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు చలనం లేకుండా పడిఉండగా మరో విద్యార్థిలో కదలిక కనిపిస్తోంది. ఏం జరిగిందో తెలియక కేకలు పెడుతున్న చిన్నారుల అరుపులు విని అక్కడకు చేరుకున్న స్థానికులు అక్కడి పరిస్థితిని బట్టి చిన్నారులు పిడుగుపాటు గురైనట్లు గ్రహించారు. వెంటనే ఆ నలుగురిని అందుబాటులో ఉన్న ద్విచక్రవాహనాలపైనే ఆస్పతికి తరలించారు. ఆ తరువాత ఆ విషయం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. అయితే గ్రౌండ్ లో ఎవరైతే చలనం లేకుండా పడిఉన్నారో వారంతా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించగా చలనం ఉన్న ఒక్క విద్యార్థి మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నాడు.
మైదానంలో ఆనందంగా క్రికెట్ ఆడుకుంటున్న తమ పిల్లలు మేరాజోతు మనోహర్నాయక్ ( 11), భోజవాతు శ్రీహరినాయక్(14), మూఢావతు పవన్ నాయక్ (16) అంతలోనే అనూహ్యంగా పిడుగుపాటుకు గురై మృత్యువు ఒడిలోకి చేరుకున్నారని తెలిసి ఆ చిన్నారుల తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వీరిలో ఇద్దరు బాలురు తమ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం గమనార్హం. ఈ చిన్నారుల మృతితో వెయ్యి మంది ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న సమాదానంపేట మొత్తం పెను విషాదంలో మునిగిపోయింది.
చనిపోయిన ముగ్గురు విద్యార్థులు మేరాజోతు మనోహర్నాయక్, భోజవాతు శ్రీహరినాయక్, మూఢావతు పవన్ నాయక్ ఎస్టీ వర్గానికి చెందిన వారు. వీరిలో మనోహర్ నాయక్ 4వ తరగతి, శ్రీహరి నాయక్ 7వ తరగతి, పవన్ నాయక్ 10వ తరగతి చదువుతున్నారు. చిన్నారుల మరణ వార్త తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల రోదనలతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం అలముకుంది. ఎవరిని కదిలించినా ఏడుపులు, రోదనలే. విషయం తెలుసుకున్న గురజాల ఆర్డీఓ ఇ.మురళి, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ వై.రామారావు ఆసుపత్రికి వచ్చి పరిస్థితి పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయానికి కృషి చేస్తానని తెలిపారు.