ఏపీలో కొత్తగా 34 పాజిటివ్:: 226కు చేరిన కేసుల సంఖ్య: ఆ ఆరు జిల్లాలు యమ డేంజర్..!
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే వస్తోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ..ఫలితం కనిపించట్లేదు. రోజురోజుకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పదుల సంఖ్యలో నమోదవుతోంది. ఆదివారం ఉదయం నాటికి రాష్ట్రంలో కొత్తగా 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 226కు చేరింది.
నాలుగు జిల్లాల్లోనే అత్యధికం..
రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో పరిస్థితి అత్యంత విషమంగా తయారైంది. కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. యథేచ్ఛగా విజృంభిస్తోంది. గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 34కు చేరింది. గుంటూరు-30, కృష్ణా-27, కర్నూలు-27, కడప-23, ప్రకాశం-23 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు-17, విశాఖపట్నం-15, పశ్చిమ గోదావరి-15, తూర్పు గోదావరి-11, అనంతపురం-3 కేసులు ఉన్నట్లుగా తేలింది.
కొత్తగా నమోదైన 34 కేసుల ఎక్కడెక్కడంటే..
కొత్తగా నమోదైన 34 కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లు తేలింది. కర్నూలు జిల్లాలో 23 పాజిటివ్ కేసులను గుర్తించినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అవుకు, బనగానపల్లి సహా పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒంగోలు-2, చిత్తూరు-7, నెల్లూరు-2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారందర్నీ వేర్వేరు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.
ఆ రెండు జిల్లాలు మినహా..
ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో కరోనా వైరస్ జాడలు కనిపించలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. 30కి పైగా అనుమానితుల నుంచి రక్తాన్ని సేకరించి కరోనా వైరస్ ల్యాబొరేటరీకి పంపించారు. వాటిల్లో కొన్ని నివేదికలు నెగెటివ్గా తేలాయి. మరి కొన్ని నివేదికలు అందాల్సి ఉంది. తేలిన ఈ 34 కేసుల్లో మెజారిటీ ఢిల్లీలోని మర్కజ్ భవనంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ ప్రార్థనలతో ముడిపడి ఉన్నవేనని సమాచారం.