శబరిమలలో తొక్కిసలాట, 12 మంది ఏపీ భక్తులకు గాయాలు, కేరళ డీజీపీకి మంత్రి పల్లె ఫోన్
శబరిమలలోని మలికప్పురం ఆలయంలో ఆదివారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
శబరిమల: శబరిమలలోని మలికప్పురం ఆలయంలో ఆదివారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 21 నుంచి 25 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఏపీ భక్తులు 12 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది.
క్షతగాత్రుల్లో అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని పంపా, కొట్టాయం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట అనంతరం పలువురి ఆచూకీ లభ్యం కావడం లేదు. నరసారావుపేటకు చెందిన ఇద్దరి ఆచూకీ కూడా లభ్యం కాలేదని తోటి భక్తులు ఆదివారం సాయంత్రం చెప్పారు.
తొక్కిసలాట జరిగిన మలికప్పురం ఆలయానికి సమీపంలో ఉంటుంది. సన్నిధానానికి మలికప్పురం ఆలయానికి మధ్య కర్రకు తాడు కట్టి ఏర్పాటు చేసిన బారీకేడ్ భక్తుల రద్దీతో పడిపోవడంతో ఒకరిపై మరొకరు పడ్డారు. ఇద్దరికి తల, పక్కటెముకల్లో తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు.
ఆలయంలో దీపారాదన సమయంలో భక్తులు చొచ్చుకు రావడంతో తొక్కిసలాట జరిగినట్లుగా చెబుతున్నారు. ఆలయం వెలుపల బందోబస్తు కూడా సరిగా లేదంటున్నారు. తొక్కిసలాట ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, 2011లో 104 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.
కేరళ డిజిపితో మాట్లాడిన మంత్రి పల్లె
తొక్కిసలాట ఘటన పైన ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కేరళ డిజిపితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏపీకి చెందిన భక్తులకు చికిత్స అందేలా చూడాలన్నారు. ఏపీకి చెందిన భక్తులను ఉచితంగా స్వస్థలాలకు పంపేలా చూడాలన్నారు.