ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మరోసారి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కు చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 7091కి చేరింది.
గత 24గంటల వ్యవధిలో ఏపీ జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 15, చిత్తూరులో 81, తూర్పుగోదావరిలో 49, గుంటూరులో 53, కడపలో 12, కృష్ణాలో 43, కర్నూలులో 12, నెల్లూరులో 24, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 28, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి.
కాగా, ఇప్పటి వరకు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోని 1,23,503 కేసులు నమోదు కావడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా లక్షకు చేరువలో పాజిటివ్ కేసులున్నాయి. పశ్చిమగోదావరిలో 93,729 నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 354 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,69,478కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3861 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,15,31,206 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య వివరాలను వెల్లడించింది.