ఏపీపైనా మహారాష్ట్ర ఎఫెక్ట్: తగ్గుముఖం పట్టని కరోనా: ఆ రెండు జిల్లాల్లో డేంజర్ బెల్స్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఒకరోజు తగ్గాయనే ఊపిరి తీసుకున్న 24 గంటల్లోపే మళ్లీ పెరుగుదల బాట పట్టడం సర్వసాధారణంగా మారింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ మాత్రం అడ్డూ, అదుపు లేకుండా నమోదైన గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భావించేలోపే.. మరో రెండు జిల్లాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2100కు చేరుకుంది.
TTD: తిరుమలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: అత్యవసర సేవల కింద టీటీడీ: ఎస్మా ప్రయోగానికీ..
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో
తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటోన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో నెల్లూరులో 12, చిత్తూరులో తొమ్మిది కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు జిల్లాల్లో కూడా చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రభావం పడిందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారలుు ఇదివరకే వెల్లడించారు. కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారి వల్ల ఈ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని చెబుతున్నారు.
కర్నూలులో జీరో..గుంటూరులో అయిదే
కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభమైన తొలి రోజుల్లో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం కేసుల్లో ఈ రెండు జిల్లాల వాటానే అధికం. అలాంటిది క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. కర్నూలు జిల్లాలో జీరో కేసులు నమోదు అయ్యాయి. చాలాకాలం తరువాత ఈ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇదే తొలిసారి. గుంటూరులో కొత్తగా అయిదు కేసులు మాత్రమే జాబితాలోకి వచ్చి చేరాయి. కర్నూలులో మొత్తం కేసుల సంఖ్య 591 కాగా.. 316 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 257. 18 మంది మరణించారు.
1200లకు చేరువగా డిశ్చార్జిలు..
గుంటూరులో మొత్తం కేసుల సంఖ్య 404కు చేరుకోగా.. యాక్టివ్గా ఉన్నవి 150. 246 మంది ఈ జిల్లాలో డిశ్చార్జి అయ్యారు. ఎనిమిది మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటిదాకా 2100 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1192 మంది డిశ్చార్జి అయ్యారు. 48 మంది చనిపోయారు. 860 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. త్వరలో మరో 30 నుంచి 40 మంది కరనా వైరస్ పేషెంట్లు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.
Recommended Video
దెబ్బకొట్టిన మహారాష్ట్ర..
పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఒడిశా-10, మహారాష్ట్ర-67, గుజరాత్-26 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్రలో 22 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అక్కడి నుంచి స్వస్థలాలకు వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ సోకుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 67 మందికి వైరస్ సోకింది. వారిలో చాలామంది అనంతపురం జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఉపాధి కోసం మహారాష్ట్రకు వెళ్లొచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి.