36వ రోజు ... రాజధాని తరలింపుకు నిరసనలు .. గుంటూరు జిల్లా బంద్.. అనుమతి లేదన్న పోలీసులు
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులకు అసెంబ్లీలో బిల్లుకు ఆమోద ముద్ర పడిన నేపధ్యంలో రాజధాని ప్రాంత రైతులు , ప్రజలు ఆగ్రహావేశాల్లో ఉన్నారు.రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన నేడు 36వ రోజుకు చేరింది. ఇవాళ గుంటూరు జిల్లా బంద్కు అమరావతి జేఏసీ పిలుపు ఇచ్చింది. కానీ బంద్ కు అనుమతి లేదని పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. కానీ రాజధాని ప్రాంత ప్రజలు బంద్ కొనసాగిస్తామని , తమ నిరసన తెలియజేస్తామని చెప్తున్నారు.
క్యాబినెట్ నిర్ణయాలతో అమరావతిలో ఉద్రిక్తత .. తనిఖీలతో వారధిపై ట్రాఫిక్ జామ్.. ఆర్టీసీ బస్సులు బంద్
36వ రోజు రాజధాని నిరసనలు
ఇక నేడు రాజధాని అమరావతి కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగానున్నాయి . ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతుల నిరసన తెలపనున్నారు. నవలూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర గ్రామాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాజధాని అమరావతి కోసం పోరాటం సాగించనున్నారు .
గుంటూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన జేఏసీ .. పర్మీషన్ లేదన్న పోలీసులు
మూడు రాజధానుల బిల్లుకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసి జిల్లా బంద్కు పిలుపునిచ్చిన నేపధ్యంలో బంద్కు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు జిల్లా పోలీసులు తెలిపారు. ఎవరైనా బలవంతంగా స్కూళ్లు, షాపులు మూసివేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు . శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు . మరోవైపు రాజధాని గ్రామాలకు అమరావతి జేఏసీ నేతలు వెళ్లనున్నారు. ఇక పోలీసులు జరిపిన లాఠీచార్జ్లో గాయపడిన రైతులను జేఏసీ నేతలు పరామర్శించనున్నారు.
అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు
పోలీసులు ఆందోళనలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నా రాజధాని అమరావతి గ్రామాల్లో నిరసనల పర్వం కొనసాగుతుంది. ఇక రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి బంద్కు పిలుపునిచ్చింది. మూడు రాజధానుల సెగతో ఇప్పటికే అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అమరావతి జేఏసీ బంద్కు పిలుపునివ్వడంతో అసెంబ్లీ, సచివాలయంతో పాటుగా పలు చోట్ల పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు