ఏపీలో 393 సహాయక శిబిరాలు: వలస కూలీలకు ఆపన్నహస్తం, వసతితోపాటు భోజనం, 21 వేల మంది..
కరోనా వైరస్తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకొన్నారు. అక్కడే ఉంటే ఫరవాలేదు.. కానీ చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక వలసకూలీల బాధలు వర్ణణాతీతం. వారి వెతలు చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి సహాయక శిబిరాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన 393 సహాయక శిబిరాలను నెలకొల్పారు. ఇందులో 21 వేల 25 మందికి వసతి కల్పించి ఆహారం అందిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ చొరవకు కూలీలే కాదు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాధినేతలు కూడా అభినందిస్తున్నారు.
393 సహాయక శిబిరాలు..
393 సహాయక శిబిరాల్లో ఉన్నవారికి ఆహారం, వసతి విషయంలో రాజీ పడొద్దని సీఎం జగన్ స్పష్టంచేశారు. మంచి భోజనం, సౌకర్యాలు కల్పించాలని అధికారులకు స్పష్టంచేశారు. ఆయా శిబిరాల్లో కల్పిస్తోన్న వసతి గురించి అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వైరస్ వల్ల ఆపత్కాలంలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తున్నామని ఏపీ వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్, సహాయక శిబిరాల నోడల్ ఆఫీసర్ పీయూష్ కుమార్ తెలిపారు. శిబిరాల్లో రాష్ట్రానికి చెందినవారు కూడా ఉన్నారని వివరించారు.
రాష్ట్రానికి చెందినవారు కూడా..
రాష్ట్రంలోని ఇతర పనుల కోసం వచ్చి చిక్కుకపోయిన వారు 12 వేల 820 మంది ఉన్నారని పీయూష్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8 వేల 205 మంది అని వివరించారు. 23 రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఉన్నారని.. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 1334 మంది ఉన్నారని తెలియజేశారు. తర్వాత తమిళనాడు నుంచి 1198, జార్ఖండ్, 918, బీహర్ 735 మంది వలస కూలీలు ఉన్నారని పేర్కొన్నారు. వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల గురించి తెలుసుకొన్న తమిళనాడు సీఎం పళనిస్వామి.. సీఎం జగన్కు అభినందనలు కూడా తెలిపారు.
అత్యధికంగా ఇక్కడే..
కృష్ణా జిల్లాలో అధికంగా 1076 శిబిరాలను నెలకొల్పారు. ఇక్కడ అత్యధికంగా 7 వేల 61 మందికి ఆశ్రయం కల్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కేవలం నాలుగు శిబిరాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఆయా శిబిరాల్లో సామాజిక దూరం పాటించేలా పడకలు ఉన్నాయని.. అందులో ఉన్నవారికి ఉదయం అల్పాహారం కూడా అందజేస్తామని చెప్పారు. భోజనంతోపాటు ఉడకపెట్టిన గుడ్లను కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు.
నిరంతరం పర్యవేక్షణ
ఆయా శిబిరాల్లో అందజేస్తున్న ఆహారం, వసతులను పరిశీలించేందుకు అధికారులను కూడా నియమించామని పీయూష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వంతోపాటు 95 ఎన్ జీ వో సంస్థలు కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యాయని వివరించారు. అంతేకాదు శిబిరాల్లో ఉంటున్నవారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆపద సమయంలో ప్రభుత్వం తమకు వసతి కల్పించి, ఆహారం అందించడంపై అందులో ఉన్న వలసకూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.