ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: అత్యధిక కేసులు, మరణాలు ఏ జిల్లాలోనంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు పెంచుతున్నప్పటికీ కొత్తగా నమోదవుతున్న కేసులు మాత్రం తగ్గుతున్నాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం గమనార్హం. అంతేగాక, గత కొద్ది రోజులుగా కరోనా మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది.
ఏపీలో కొత్తగా 3967 కరోనా కేసులు, 25 మరణాలు
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74,337 కరోనా పరీక్షలు నిర్వహించగా 3967 కరోనా కేసులు నమోదయ్యాయి. 25 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,75,470కి చేరింది. ఇక ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6382కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
చిత్తూరులో అత్యధిక మరణాలు
జిల్లాల వారీగా కరోనా మరణాలు గమనించినట్లయితే.. చిత్తూరులో ఐదుగురు, కడప, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
తూర్పుగోదావరిలోనే అత్యధిక కరోనా కేసులు
ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులను పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 233, చిత్తూరులో 510, తూర్పుగోదావరిలో 608, గుంటూరులో 246, కడపలో 212, కృష్ణాలో 456, కర్నూలులో 100, నెల్లూరులో 220, ప్రకాశంలో 355, శ్రీకాకుళంలో 108, విశాఖపట్నంలో 206, విజయనగరంలో 86, పశ్చిమగోదావరిలో 627 కేసులు నమోదయ్యాయి. ,
Recommended Video
కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ
కాగా, గడిచిన 24 గంటల్లో 5010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 7,30,109కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38,979 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 69,20,377 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో ఇప్పటి వరకు 74,13,343 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 8,02,408 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు64,97,001 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 1,12,750 మంది మరణించారు.