39వ రోజు కొనసాగుతున్న అమరావతి పోరు ... తెనాలిలో దీక్షా శిబిరంపై వైసీపీ దాడి..ఉద్రిక్తత
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలీ దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలు 39వ రోజు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు.
టీడీపీపై వైసీపీ రివర్స్ ఎటాక్ .. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
రాజధాని గ్రామాల్లో , మద్దతుగా జిల్లాలో కొనసాగుతున్న దీక్షలు
వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాలలో దీక్షలు చేపట్టారు. నిరసనలో భాగంగా ఈరోజు వివిధ గ్రామాల నుంచి మహిళలు, రైతులు అంతవరం వెంకన్న సన్నిధి వరకు ర్యాలీ నిర్వహించారు. అమరావతినే రాజధానిగా ఉండేలా చూడాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.రాజధాని అమరావతికి మద్దతుగా కలెక్టరేట్ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులో నేడు 26వ రోజు టీడీపీ నేత గోళ్ళ ప్రభాకర్ నేతృత్వంలో తూర్పు నియోజకవర్గం ప్రజలు దీక్షలో కూర్చున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు దీక్షలను ప్రారంభించారు. అక్కడ కూడా అమరావతికి మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి.
తెనాలిలో దీక్షా శిబిరంపై వైసీపీ కోడిగుడ్లు , టమాటాలతో దాడి
తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద రాజధాని అమరావతికి మద్దతుగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో అమరావతి కోసం చేస్తున్న ఆందోళనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . అమరావతి రిలే దీక్ష శిబిరంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక దీక్ష చేసే మహిళలను బెదిరింపులకు గురి చేస్తున్నట్టు దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు బైక్లతో చక్కర్లు కొడుతున్నారు.
రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వైసీపీ .. ఉద్రిక్తత
అంతే కాదు కవ్వింపు చర్యలకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది . శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు.శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేసి రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. ఇక వైసీపీ నేతల తీరుపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తోపులాటకు దారి తీసింది. ఇక ఈ ఘర్షణ ఆపటానికి మాజీమంత్రి ఆలపాటి రాజా రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు నచ్చజెప్తున్నారు.