తిట్టారని పారిపోయిన నలుగురు శ్రీచైతన్య విద్యార్థులు;ఇక చదవలేనని విద్యార్ధిని ఆత్మహత్య
విజయవాడ:కృష్ణా జిల్లా నిడమానూరులోని శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ నుంచి నలుగురు ఇంటర్ విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థులు కనిపించకుండా పోవడంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిడమానూరు శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిఖిల్ యాదవ్, హర్షవర్ధన్, సుమిత్, చంద్రమౌళి ప్రవర్తన సరిగ్గా లేదనే కారణంతో కళాశాల యాజమాన్యం వారిని మందలించింది. మీ తల్లిదండ్రులను పిలుచుకురావాలని హెచ్చరించింది. దీంతో తమ విషయం తల్లిదండ్రులకు తెలిసిపోతుందనే భయంతో ఆందోళన చెందిన ఈ నలుగురు విద్యార్థులు...హాస్టల్ నుంచి పరారయ్యారని చెబుతున్నారు.
అయితే నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో శ్రీ చెతన్య కళాశాల యాజమాన్యం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇదిలావుంటే విద్యార్థుల కనిపించకుండా పోయిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతంగా ఉంది.
మరోవైపు తాను చదవలేకపోతున్నానంటూ డోన్ పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీకి చెందిన కె.ప్రియాంక (20) అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ నగర్ కాలనీలో నివాసముండే కటికె రాముడు కుమార్తె ప్రియాంక. ఏడాది క్రితం స్థానికంగా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసింది. పైచదువులకు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు.
అయితే ఇక తాను చదవలేనని ఇంటి వద్దనే ఉండిపోయింది. ఇదే విషయమై మథనపడుతూ చాలారోజులుగా దిగులుతో ఉండేది. ఈ నేపథ్యంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు.