ఏలూరులో తీవ్ర కలకలం... 40 మందికి అస్వస్థత... వాంతులు,స్పృహ తప్పి...
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పడమర వీధి,కొత్త వీధి,దక్షిణ వీధిలో స్థానికులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 40 మంది నురుగలు కక్కుంటూ స్పృహ తప్పి పడిపోవడం తీవ్ర కలకలం రేగింది. అస్వస్థతకు గురైనవారిలో 15 పైచిలుకు మంది చిన్నారులు ఉన్నారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంబులెన్సులను రప్పించి... అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలించారు.
ఇంతమంది ఒకేసారి ఎందుకు అస్వస్థతకు గురయ్యారన్నది ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. ఒక పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించామని మంత్రి వెల్లడించారు. మిగతా 22 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని... వారి బ్లడ్ శాంపిల్స్ను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి పంపించారని చెప్పారు. ప్రస్తుతం ఏలూరు పట్టణంలోని పడమరవీధిలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు.ఆ వివరాలను మంత్రి ఆళ్ల నాని ఫోన్ ద్వారా ఆరా తీశారు.
ఏలూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మున్సిపల్ వాటర్లో మురుగునీరు చేరడంతోనే స్థానికులు అస్వస్థతకు గురయ్యారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.స్థానిక వైద్యాధికారులు,అధికార యంత్రాంగం దీనికి గల కారణాలను ఆరా తీస్తున్నాయి. మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.