ఏపీలో ఒక్కరోజులో భారీగా కరోనా కేసులు, రెండు మరణాలు: 92కు చేరిన మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13,923 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా 425 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది.
తాజాగా నమోదైన 425 కేసుల్లో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 126 ఉండగా, రాష్ట్రంలో 299 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7496కు చేరింది.
గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 92కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2983కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2779 యాక్టివ్ కేసులున్నాయి.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరులో 600కుపైగా కరోనా కేసులున్నాయి. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు.
Recommended Video
ఇక దేశ వ్యాప్తంగా 3,68,389 మంది కరోనా బారినపడ్డారు. 1,61,374 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,94,696 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 12,274 మంది ప్రాణాలు కోల్పోయారు.