ఒకేరోజు 43: జగన్ సొంత జిల్లాలో అత్యధిక కరోనా పాజిటివ్: పులివెందుల సహా..: 87కు చేరిన కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే 43 కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే అత్యధికంగా 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కడప, పశ్చిమ గోదావరి సహా మొత్తం ఎనిమిది జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.
ఢిల్లీ మత ప్రార్థనల ఎఫెక్ట్: మత పెద్దలపై ఎఫ్ఐఆర్: కఠినమైన సెక్షన్ల కింద: ఏకంగా ఏడుమందిపై
కడపలో 15 పాజిటివ్ కేసులు..
ఇప్పటిదాకా వైరస్ బారిన పడిన కడప జిల్లాలో ఒకేసారి 15 పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనం రేపుతోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలానికి తిరిగి వచ్చిన వారేనని తెలుస్తోంది. కడప జిల్లాలో ఈ 15 కేసులు ఏ ప్రాంతాల్లో నమోదు అయ్యాయనే విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. అయినప్పటికీ.. కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల ప్రాంతాలకు చెందిన వారై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
పశ్చిమ గోదావరిలో 13
పశ్చిమ గోదావరి జిల్లలో 13 కేసులు నమోదు అయ్యాయి. నిజానికి 14 కేసులు నమోదైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ వార్తలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించలేదు. తాజాగా 13 కేసులు నమోదైనట్లు అధికారికంగా వెల్లడించారు. సమాచార లోపం వల్లే 14 కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారని వివరణ ఇచ్చారు. ఏలూరులో అయిదు కేసులు నమోదు అయ్యాయి. భీమవరం, నారాయణపురంలల్లో రెండు చొప్పున, ఆకివీడు, గుండుగొలను, ఉండిలలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు వెల్లడించారు.
చిత్తూరులో అయిదు
చిత్తూరు జిల్లాలో అయిదు కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. దీనితో చిత్తూరు జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ అయిదు మంది కూడా శ్రీకాళహస్తికి చెందిన వారేనని భావిస్తున్నారు. శ్రీకాళహస్తికి చెందిన 15 మంది ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలానికి వచ్చారు. ఈ 15 మందిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. వారి రక్తాన్నిసేకరించి, స్విమ్స్కు పంపించగా.. అయిదుమంది పాజిటివ్గా తేలినట్లు సమాచారం. మిగిలిన వారి రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని చెబుతున్నారు.
విశాఖ, ప్రకాశం, నెల్లూరుల్లో కొత్త కేసులు..
ఇప్పటికే కరోనా వైరస్ బయటపడిన అన్ని జిల్లాల్లోనూ కొత్తగా మరోసారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం-4, నెల్లూరు-2, తూర్పు గోదావరి-2, కృష్ణా-1, విశాఖపట్నం-1 కేసు నమోదు అయ్యాయి. ఫలితంగా- మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రకాశంలో 15, తూర్పు గోదావరిలో ఆరు, కృష్ణాలో ఆరు, విశాఖపట్నంలో 11కు పెరిగినట్టయింది.