ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు: జిల్లాలవారీగా కేసులు, కరోనా బారినపడిన వైసీపీ ఎంపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,236 నమూనాలను పరీక్షించగా.. 438 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,723కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు
24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7076కు చేరింది. ఇక ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు గమనించినట్లయితే.. అనంతపురంలో 20, చిత్తూరులో 80, తూర్పుగోదావరిలో 38, గుంటూరులో 54, కడపలో 14, కృష్ణాలో 83, కర్నూలులో 7, నెల్లూరులో 24, ప్రకాశంలో 23, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 20, పశ్చిమగోదావరిలో 21 కేసులు నమోదయ్యాయి.
4వేల దిగువకు కరోనా కేసులు
ఒక్క రోజు వ్యవధిలో 589 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,67,445కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4202 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,12,60,810 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఏపీలో కరోనా పరీక్షల ధరలను ఇటీవల తగ్గించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపే నమూనాల పరీక్షల ధరలను రూ. 800 నుంచి 475కు తగ్గించింది. ఎన్ఏబీఎల్ ల్యాబుల్లో కరోనా టెస్టు ధరను రూ. 1000 నుంచి రూ. 499కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా బారిన వైసీపీ ఎంపీ మాగుంట..
ఇది ఇలావుండగా, ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కోవిడ్ రెగ్యూలర్ టెస్ట్ చేయించుకోగా.. తేలికపాటి లక్షణాలతో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని తెలిపింది. ప్రస్తుతం ఎంపీ మాగుంట అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది.