నిమ్మగడ్డ వద్దంటోన్నా: పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు: అత్యధికం.. అత్యల్ప జిల్లాల లిస్ట్ ఇదే
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది. వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు. ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించట్లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తోన్న ప్రకటనలను గ్రామస్తులు పట్టించుకోనట్టే. తొలిదశ పోలింగ్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి ఏకగ్రీవాలు తేలాయి.
రాష్ట్రవ్యాప్తంగా 453 పంచాయతీలు ఏకగ్రీవంగా..
తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా, అత్యల్పంగా అనంతపురం జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. అనంతపురంలో ఆరుచోట్ల స్థానికులు తమ సర్పంచ్ను పోటీ లేకుండా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లాలో తొలి విడత మొత్తం 454 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో 96 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 358 పంచాయతీలకు ఈ నెల 9వ తేదీన పోలింగ్ ఉంటుంది.
గుంటూరులో రెండో అత్యధికం..
రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. తొలి విడత 337 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. 67 ఏకగ్రీవం అయ్యాయి. మూడు రాజధానులను నిరసిస్తూ 400 రోజులకు పైగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతోన్న ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడపలో 46, న్యాయ రాజధానిగా ఏర్పాటు కాబోతోన్న కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
అనంతలో అత్యల్పం..
శ్రీకాకుళం జిల్లాలో 34 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. పశ్చిమగోదావరి-40, విశాఖపట్నం-32, తూర్పు గోదావరి-28, కృష్ణా జిల్లా-20, ప్రకాశం-16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అనంతపురంలో ఆరు పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో 1,323 నామినేషన్లను తిరస్కరించారు. రెండో విడత పంచాయతీల నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. రెండో దశలో 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 13న ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4గంటలకు కౌంటింగ్ చేపడతారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు.