ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, 8వేలకు చేరువలో, మరో నలుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,609 మంది నమూనాలు పరీక్షించగా 465 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాల నుంచి వచ్చిన 19 మందికి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఏపీలో ఒక్కరోజులో భారీగా కరోనా కేసులు, రెండు మరణాలు: 92కు చేరిన మరణాలు
రాష్ట్రంలో మరో 376 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 7,961 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో మరో నలుగురు మృతి చెందారు.
వీరిలో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 96కు చేరింది. రాష్ట్రంలో మొత్తం 6134 కేసులు నమోదు కాగా, 3065 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 3069 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా 3,82,143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,64,047 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,05,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 12,610 మంది మరణించారు.