ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయ్: నీళ్లు చల్లిన కోయంబేడు: వలంటీర్లకు కొత్త టాస్క్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ ఒక్కసారిగా పెరుగుదల బాట పట్టాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2137కు చేరింది. ఈ సారి చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ప్రభావం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కోయంబేడు మార్కెట్తో లింకులు ఉన్న వారిని గుర్తించడానికి ప్రభుత్వం మరోసారి వలంటీర్లు, ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు, గుంటూరుల్లో..
కొత్తగా నమోదైన 48 కేసుల్లో అత్యధికం గుంటూరు జిల్లాలో నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 24 గంటల వ్యవధిలో మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. చిత్తూరులో 11, కర్నూలులో ఏడు, తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు వెలుగు చూశాయి. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో మూడు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, కర్ణాటకల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారిలో మొత్తం 73 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
కోయంబేడు మార్కెట్తో లింకులు..
ఇందులో మహరాష్ట్ర-38, గుజరాత్-26, ఒడిశా-8, కర్ణాటక నుంచి వచ్చిన ఒకరు పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. అదే సమయంలో చిత్తూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన నాలుగు కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవేనని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారలుు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులు, కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారి వల్ల కేసులు పెరిగినట్లు తెలిపారు.
2137కు చేరిన మొత్తం కేసులు..
దీనితో మొత్తంగా రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2137కు పెరిగింది. ఇందులో 1142 మంది డిశ్చార్జి అయ్యారు. 948 మంది ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటిదాకా 47 మంది మరణించారు. 24 గంటల్లో 86 మంది కరోనా వైరస్ పేషెంట్లు ఐసొలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో నలుగురు కరోనా వైరస్ పేషెంట్లు ఉండగా.. ముగ్గురు పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఈ జిల్లాలో ఒక్కరే పేషెంట్ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రకాశంలో మొత్తం 63 మంది పేషెంట్లు ఉండగా..60 డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
వలంటీర్లు, ఆశా వర్కర్లకు కొత్త టాస్క్
ఈ పరిస్థితుల్లో కోయంబేడు మార్కెట్, పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఇంటింటి సర్వే చేసే అవకాశాలు లేకపోలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇళ్లకు చేరుకున్న వలస కార్మికులను గుర్తించడం, వారికి వైద్య పరీక్షలను చేయించడం, అవసరమైతే క్వారంటైన్ కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. దీనికోసం వలంటీర్లు, ఆశా వర్కర్లకు కొత్త టాస్క్ను ఇవ్వనుంది ప్రభుత్వం.
Recommended Video
జిల్లాలవారీగా..
జిల్లాలవారీగా అనంతపురం-118, చిత్తూరు-142, తూర్పు గోదావరి-51, గుంటూరు-399, కడప-97, కృష్ణా 349, కర్నూలు-591, నెల్లూరు-111, ప్రకాశం-63, శ్రీకాకుళం-5, విశాఖపట్నం-66, విజయనగరం-4, పశ్చిమ గోదావరి-68 కేసులు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారిని ఇతరుల జాబితాలోకి చేర్చింది ప్రభుత్వం. అలాంటి వారు మొత్తం 73 మంది ఉన్నారు. వారంతా ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు.