ఏపీలో 49 ఇంజినీరింగ్ కాలేజీలు క్లోజ్: అన్నీ జేఎన్టీయూ పరిధిలోనివే.. ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్లో 49 ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడబోతున్నాయి. మినిమమ్ అడ్మిషన్స్, వసతులు లేకపోవడంతో మూసివేయాలని వర్సిటీలు ప్రతిపాదించాయి. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
25 శాతం అడ్మిషన్లు
25 శాతం అడ్మిషన్లు లేని ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ చేస్తారు. మొత్తం 49 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. జేఎన్టీయూకే పరిధిలో 26, జేఎన్టీయూఏ పరిధిలో 23 కాలేజీలు ఉన్నాయి. కొన్నేళ్లుగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు కలిగి ఉండటం, జీరో అడ్మిషన్ల వల్ల ఆయా ఇంజనీరింగ్ కాలేజీల క్లోజ్ చేయాలని రెండు వర్సిటీలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. పాలక మండళ్ల (ఈసీ) ఆమోదముద్ర వేయించుకుని ఆ కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి, ఉన్నత విద్యాశాఖకు పంపించాయి.
కౌన్సెలింగ్ నుంచి అవుట్
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్ జాబితా నుంచి ఆయా కాలేజీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ 49 కాలేజీలు మూతపడితే వెబ్ కౌన్సెలింగ్లో 12 వేల వరకు సీట్లు కనిపించవు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు లేవనే కారణంతో మరో 64 ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను తగ్గించాలని కూడా ఆ వర్సిటీలు నిర్ణయించాయి.
తగ్గిన సీట్లు
ఇటు మరోవైపు జేఎన్టీయూకే పరిధిలోని 47 కాలేజీల్లో 4,812 సీట్లు తగ్గించింది. జేఎన్టీయూఏ ప్రతిపాదించిన 23 కాలేజీలు, సీట్లు తగ్గించిన 17 కాలేజీల్లో కలిపి దాదాపు 5,100 సీట్లు తగ్గించనుంది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కొన్నాళ్ల క్రితం జీరో అడ్మిషన్లు, మౌలిక సదుపాయాలు లేని కాలేజీలు, ఆదాయ-వ్యయాల లెక్కల్లో తేడాలు ఉన్నాయని గుర్తించిన కాలేజీల జాబితాను జేఎన్టీయూకే, జేఎన్టీయూఏలకు పంపించింది. దీనిపై తనిఖీ చేసి నివేదించమని ఆదేశించింది. ఆయా వర్సిటీలు నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటుచేసి.. తనిఖీలు చేయించాయి. ఆ తర్వాత కాలేజీలకు సంబంధించిన సమాచారంతో సరి చూసి.. నివేదిక అందజేశాయి. నిజమే అని తేలడంతో.. మూసివేయాలని ప్రతిపాదన చేశాయి.