ఏపీలో కరోనా విలయం: 491 పాజిటివ్ కేసులు, ఐదుగురి మృతి, 101కి చేరిన సంఖ్య..
ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న తెలంగాణలో 499 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ ఏపీలో 491 కేసులు బయటపడ్డాయి. వైరస్ కేసులు క్రమంగా పెరగడం భయాందోళన కలిగిస్తోంది. 491 కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 390 మంది కాగా.. 101 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 83 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. 18 మంది విదేశీయులు ఉన్నారు.
డేంజర్ జోన్లో హైదరాబాద్, కరోనా కేసులు పెరగడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన..
390 మంది
గత 24 గంటల్లో 17,609 మంది రక్త నమూనాలను సేకరించగా.. 390 మందికి పాజిటివ్ వచ్చింది. 138 మందికి వైరస్ తగ్గడంతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 6,620 కేసులు నమోదు కాగా, 3,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ దవాఖానాల్లో 3,316 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది.
విదేశీయులు...
ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారితో కలిపి ఇప్పటివరకు 8,452 కేసులు నమోదు కాగా.. వీరిలో 4,111 మంది డిశ్చార్జయ్యారు, 4, 240 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వైరస్ సోకిన మొత్తం సంఖ్య 1506 మంది కాగా.. ప్రస్తుతం 647 మంది చికిత్స పొందుతున్నారు. 859 మంది డిశ్చార్జ్ అయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి పాజిటివ్ కేసులను గుర్తించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 326 కాగా, 277 మంది చికిత్స పొందుతున్నారు. 49 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Recommended Video
లాక్ డౌన్
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో కేసులు ఎక్కువ ఉన్న ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాకడౌన్ కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాలలో.. శ్రీకాకుళం జిల్లాలో పలాస, కాశీబుగ్గలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.