విషాదం:ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం
కర్నూలు: కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి ముగ్గురు పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్యా ముగ్గురు పిల్లలతో సహా నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తలెత్తిన కుటుంబ తగాదాలే ఆత్మహత్యాయత్నానికి కారణంగా ప్రాధమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...
ఏంజరిగిందో ఏమో తెలియదు కాని కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడుకు చెందిన మద్దిలేటి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగారు. వీరి గది నుంచి కేకలు వినిపించడంతో కొద్దిసేపటికి గమనించిన స్థానికులు వీరిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరేటప్పటికే కుటుంబ యజమాని మద్దిలేటి చనిపోగా మిగిలిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ కుటుంబం అంతా అందరితో కలివిడిగా ఉండేవారని, హఠాత్తుగా వీరంతా ఇలా చేయడం షాక్ కు గురిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే ఈ కుటుంబం కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసని, అయితే ఉన్నట్లుండి ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణం ఏంటో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కోలుకొని కారణం చెబితే తప్ప ఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం వెనుక మిస్టరీ తెలిసే అవకాశం లేదు.