సముద్ర స్నానం కోసం వెళ్లి...ఐదుగురు గల్లంతు...విశాఖలో విషాదం!
విశాఖపట్టణం: విశాఖ సాగర్ నగర్ లో సముద్ర స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతు కాగా ఒక వ్యక్తి మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి కుమారుడు తొలుత సముద్రంలో కొట్టుకుపోతుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి చనిపోగా అతడి కుమారుడు మాత్రం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా గల్లంతైన వ్యక్తులు ఎవరనేది సమాచారం తెలుసుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది.
విశాఖలో కొందరు వ్యక్తులు మహాశివరాత్రిని పురష్కరించుకుని నిన్న ఉపవాసం, రాత్రి జాగారం చేసిన అనంతరం ఉదయాన్నే సముద్ర స్నానానికని వెళ్లారు. వీరిలో దువ్వి శివప్రసాద్, అతని కుమారుడు యశ్వంత్ కూడా ఉన్నారు. అయితే బీచ్ లో బలమైన అలల తాకిడికి తొలుత బాలుడు యశ్వంత్ నీటిలో మునుగుతుండగా అతడి తండ్రి శివప్రసాద్ కాపాడే ప్రయత్నంలో తాను కూడా నీళ్ళల్లో మునిగిపోయాడు. బాలుడి కేకలు విన్న స్థానికులు యశ్వంత్ను, అతడి తండ్రిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే యశ్వంత్ తండ్రి శివప్రసాద్ చనిపోగా, బాలుడిని రక్షించిన వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
అయితే వీరితోపాటు వెళ్లిన మరో ఐదుగురు వ్యక్తుల జాడ తెలియకపోవడంతో వారు కూడా సముద్రంలో గల్లంతైనట్లు భావిస్తున్నారు. అయితే ఎవరు గల్లంతయ్యారో తెలుసుకునేందుకు వివరాలు తెలిసిన శివప్రసాద్ మృత్యువాతన పడగా, అతడి కుమారుడు యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో వివరాలు తెలియరాలేదు.