ఎన్నికల కోసం 50కోట్ల ఖర్చు..! ఓటుకు రెండు వేలు జనమే అడుగుతున్నారు..! జేసీ సంచలన వ్యాఖ్యలు..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఖర్చు గురించి, ఓటర్ల డబ్బు డిమాండ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశం కోసం ఆయన సోమవారం అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో మరోసారి టీడీపీనే విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు మళ్లీ సీఎం కావడం తథ్యమని ధీమాగా చెప్పారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టీడీపీని కాపాడతాయని తెలిపారు. చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు అని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దాదాపుగా 120 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు.
అంతేగాకుండా, ఎన్నికల స్థితిగతులపైనా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయల వరకూ ఖర్చయిందని తెలిపారు. ఓటేయండని కోరితే 2000 రూపాయలు ఇవ్వాలని ప్రజలే అడుగుతున్నారని జేసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ధన ప్రాబల్యం తగ్గించాలన్నది తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 10,000 కోట్ల వరకు ఖర్చుచేశాయని అంచనా వేశారు. ఒక్కో అభ్యర్థి 25 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఉంటారని వ్యాఖ్యానించారు.