ఏపీలో భారీగా తగ్గిన కరో కేసులు: కొత్తగా 50, ఆ రెండు జిల్లాల్లో ‘0’, 845 యాక్టివ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదువుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత వారం రోజులుగా 100 లోపే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 50 కరోనా కేసులే నమోదు కావడం గమనార్హం. నెల్లూరులో కరోనాతో ఒకరు మృతి చెందారు.
ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు
గత 24 గంటల్లో 24,565 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి కరోనా ఉన్నట్లు తేలిందని ఏపీ వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 8,88,605కి చేరింది. తాజాగా ఒక్క మరణం సంభవించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మరణాల సంఖ్య 7161కి చేరింది.
ఏపీలో 845కు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్కరోజు వ్యవధిలో 121 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,80,599కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 845 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,34,22,878 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 2, చిత్తూరులో 13, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 4, కడపలో 2, కృష్ణాలో 8, నెల్లూరులో 5, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 8, విజయనగరంలో ఒక కేసు నమోదయ్యాయి. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
కరోనా నుంచి కోలుకుంటున్న దేశం..
ఇక దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గత 24 గంటల్లో 7,36,903 నమూనాలను పరీక్షించగా.. 11,067 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరింది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో 94 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,55,252కు చేరింది. తాజాగా, 13,087 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,05,61,608కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,41,511 యాక్టివ్ కేసులున్నాయి.