శుభవార్త: ఏపీలో ఆ ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంపు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీతాలు 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలను ఈ మేరకు పెంచింది.
అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీతాలు 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలను ఈ మేరకు పెంచింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతన పెంపుపై గత నెల 15న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం వారికి వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఇప్పుడు చెల్లిస్తున్న వేతనాలపై మరో 50 శాతం వేతనాలు పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిప్రకారం ఒప్పంద ఉద్యోగుల్లో ఎవరికీ నెలకు రూ.12వేలకు తక్కువ కాకుండా వేతనం చెల్లిస్తారు.
వేతనం పెంపు కేవలం కన్సాలిడేటెడ్ మొత్తం మీద మాత్రమే పెంచామని, వారికి ఎలాంటి ఇతరత్రా అలవెన్సులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వంలో ఏ శాఖలోనూ కూడా ఇకపై ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఒప్పంద ఉద్యోగులను నియమించుకోరాదని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.