చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. చంద్రబాబుకు షాక్!
రెండు రోజుల పాటు ప్రజా ప్రతినిధులకు వర్క్ షాపు ఏర్పాటు చేసి, 18 గంటలు క్లాస్ తీసుకొని పంపిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకోని షాక్ తగిలింది.
Recommended Video
విజయవాడ: ప్రజా ప్రతినిధులకు వర్క్ షాపు ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు 18 గంటలు క్లాస్ తీసుకొని పంపిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకోని షాక్ తగిలింది. షాకులివ్వడం ఏం చంద్రబాబుకేనా వచ్చేది.. మాకు రాదా అనుకున్నారు కాబోలు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ బాస్కు చిన్నపాటి షాకిచ్చారు.
రెండో రోజు వర్క్ షాపు విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పార్టీ నియోజకవర్గాల ఇంఛార్జిలు ఇందులో పాల్గొన్నారు. ప్రారంభ ఉపన్యాసం ముగిసిన తర్వాత చంద్రబాబు ట్యాబులు ఎంత మంది తీసుకొచ్చారని మీడియా సాక్షిగా ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
సగంమంది ఎమ్మెల్యేలు మాత్రమే చేతులెత్తారు. ట్యాబుల ఆపరేట్ చేయడం ఎంతమందికి వచ్చు? అంటూ రెండో ప్రశ్నసంధించారు చంద్రబాబు. కొంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీగా చేతులెత్తలేదు. కనీసం మీకు సెల్ఫోన్ అయినా ఆపరేట్ చేయడం వచ్చా? అని చంద్రబాబు మళ్లీ ప్రశ్నించారు.
సెల్ ఫోన్ ఏముందండి.. చక్కగా ఆపరేట్ చేస్తామన్నారు సదరు ఎమ్మెల్యేలు. సెల్ఫోన్ ఆపరేట్ చేసే మీరు ట్యాబ్ను ఎందుకు ఆపరేట్ చేయలేకపోతున్నారంటూ అడిగారు చంద్రబాబు. ఇదయ్యాక ఎమ్మెల్యేలకు ఓ పరీక్ష పెట్టారు చంద్రబాబు.
వ్యకత్వ వికాసాన్ని, స్వభావాలను తెలుసుకోవడానికి ఓ చిన్న ప్రశ్నావళిని వారి ట్యాబ్లోకి పంపించారు. ఆ ప్రశ్నావళిని వెంటనే పూర్తి చేసి ట్యాబులు క్లోజ్ చేయాలని సూచించారు. పరీక్ష చిన్నదేగాని ఎమ్మెల్యేలకు అది అగ్నిపరీక్షగా మారింది. చాలామంది ఎమ్మెల్యేలు గాబరా పడ్డారు.
ఓ మాజీ మంత్రి అయితే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పక్కనున్న వారితో ప్రశ్నలు చెప్పించుకున్నారు. వాటికి సమాధానం చెబుతూ మొత్తం మీద ప్రశ్నావళిని పూర్తి చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు తాము ట్యాబ్ తెచ్చుకోలేదన్నారు. మొత్తానికి ట్యాబుల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ అధినేతకు షాకిచ్చారనే చెప్పాలి.