ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: రికవరీలే ఎక్కువ, 5566కు తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, 500కి పైనే కేసులు నమోయ్యాయి. గత రెండు రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 44,086 నమూనాలను పరీక్షించగా.. 523 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 523 కరోనా కేసులు, ముగ్గురు మృతి
కొత్తగా నమోదైన 523 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,61,810కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,320కి పెరిగింది.
ఏపీలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 608 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,41,924కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 5,566 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,00,342 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 21, చిత్తూరులో 87, తూర్పుగోదావరిలో 54, గుంటూరులో 78, కడపలో 23, కృష్ణాలో 61, కర్నూలులో 02, నెల్లూరులో 46, ప్రకాశంలో 16, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 43, విజయనగరంలో 11, పశ్చిమగోదావరిలో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,004, చిత్తూరులో 2,46,043 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,883) కరోనా కేసులున్నాయి.
Recommended Video
దేశంలో తగ్గుతున్న కరోనా వ్యాప్తి, వంద కోట్ల దిశగా వ్యాక్సినేషన్
దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 13,23,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,623 మంది కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లకు పెరిగింది. మంగళవారం 197 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,52,651కి పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 19,446 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి బయటపడినవారి సంఖ్య 3.34 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,78,098 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.52 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.15 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మంగళవారం 41.36 లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 99.12 కోట్లకు చేరింది. ఒకటి రెండు రోజుల్లో ఈ సంఖ్య వంద కోట్ల దాటనుంది.