ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా: అర లక్ష దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. గత వారం పది రోజులుగా కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేలు దాటడం లేదు. మరణాల సంఖ్య కూడా కొంత మేర తగ్గింది. అయితే, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతోంది.
ఏపీలో కొత్తగా 5292 కరోనా కేసులు, 44 మంది మృతి
గత 24 గంటల్లో 66,944 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5292 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7,39,719కి చేరింది. ఒక రోజు వ్యవధిలో 42 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మృతుల సంఖ్య 6128కి చేరింది.
ఏపీ జిల్లాల వారీగా మరణాలు..
జిల్లాల వారీగా మరణాల సంఖ్యను గమనించినట్లయితే.. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, విజయనగరం జిల్లాలో ఒకరు మృతి చెందారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు..
ఇక ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులను పరిశీలిస్తే.. అనంతపురంలో 362, చిత్తూరులో 784, తూర్పుగోదావరిలో 652, గుంటూరులో 493, కడపలో 323, కృష్ణాలో 399, కర్నూలులో 175, నెల్లూరులో 311, ప్రకాశంలో 591, శ్రీకాకుళంలో 204, విశాఖపట్నంలో 198, విజయనగరంలో 188, పశ్చిమగోదావరిలో 612 కేసులు నమోదయ్యాయి.
అర లక్ష దిగువకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజులో 6102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,84,930కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,661 యాక్టివ్ కేసులున్నాయి. ఒకప్పుడు లక్ష దాటిన యాక్టివ్ కేసులు ఇప్పుడు అర లక్ష కంటే దిగువకు రావడం గమనార్హం. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పవచ్చు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 63,49,953 నమూనాలను పరీక్షించారు.