'ప్రతి నేరంతో జగన్కు లింక్, ఆ మెంటల్ కేసుని ఆసుపత్రికి పంపండి', మనకిది తప్పదు: బాబు
హైదరాబాద్: విజయవాడలో ప్రకంపనలు సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారం శుక్రవారం నాడు అసెంబ్లీలో వేడిని రాజేసింది. కాల్ మనీ వ్యవహారంపై సభ ఓసారి పది నిమిషాలు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైంది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చర్చ రాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. మీ పైన (స్పీకర్) పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, మమ్మల్ని తిట్టారని, సభ్యులను కూడా ఇష్టారీతిన తిట్టారని మండిపడ్డారు. వారిపై చర్చలు తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి పైన దాడి చేసేందుకు, రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేయడం విడ్డూరమన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా అన్నారు. మీ నాయకుడికి సభా సంప్రదాయాలు నేర్పాలని, లేదంటే మెంటల్ ఆసుపత్రికి పంపించాలని గోరంట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సహనానికి హద్దు అనేది ఉంటుందన్నారు. జగన్ పదకొండు కేసుల్లో ముద్దాయి అని, పదహారు నెలలు జైలులో ఉండి వచ్చాడని, అలాంటి వ్యక్తి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. చంద్రబాబు ప్రకటన చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వైసిపి సభ్యుల పైన సరైన చర్యలు తీసుకోవాలన్నారు.
వారిపై చర్యలు తీసుకొని మా హక్కులు కాపాడలన్నారు. వైసిపి సభ్యులు సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సీఎంపై దాడికి ప్రతిపక్ష నేత రెచ్చగొట్టి పంపిస్తారా అన్నారు. కాల్ మనీ కేసులో తమ పార్టీ నేతలను తప్పించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రభుత్వ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... సభా సంప్రదాయాలు పాటించాలన్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన రోజా పైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం వద్దకు వెళ్లి కాగితాలు లాక్కునే ప్రయత్నం దారుణమన్నారు.
జగన్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ప్రకటన ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తాము ఇంతకుముందే చెప్పామన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన చేశాక చర్చకు అవకాశముండదన్నారు.
మాకు మెంటల్ వస్తోంది: యనమల
యనమల మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత పరిస్థితి ఎలా ఉందో కానీ, ఆయన తీరుతో మాకు మెంటల్ వస్తోందని ఎద్దేవా చేశారు. రూల్స్ బుక్ ప్రతిపక్షం మంచిగా చదువుకోవాలన్నారు. ప్రకటన తర్వాత మేం చర్చకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షం తీరుతో మాకు మెంటల్ వస్తోందన్నారు. ముఖ్యమంత్రి పూర్తి చేశాక చర్చకు అవకాశముంటుందన్నారు. మీరు గందరగోళానికి గురై, మమ్మల్ని గందరగోళానికి గురి చేయొద్దన్నారు.
వైసిపి సభ్యులు ఆందోళన చేస్తుండటంతో స్పీకర్ మాట్లాడుతూ... మీరు మాట్లాడుతుంటే ఎవరు అడ్డుపడటం లేదని, అలాగే చంద్రబాబు మాట్లాడుతుంటే మీరు అడ్డుకోవద్దన్నారు.
బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. జగన్ బిఏసి సమావేశానికి రాలేదని, ఆయన వచ్చి ఉంటే అంతా అర్థమై ఉండేదన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ పైన చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు.
ప్రతి నేరంతో జగన్కు సంబంధం
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఎవరికైనా బుద్ధి, జ్ఞానం ఉండి ఉంటే ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయరని అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా ఒక ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్న జగన్ విమర్శలు చేయడం ఏమిటన్నారు. రాష్ట్రంలో జగన్కు సంబంధం లేని నేరస్తులు ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలోని ప్రతి నేరంతో జగన్కు సంబంధం ఉందన్నారు. దొంగతనం, ఎర్రచందనం దొంగలు, కాల్ మనీ అన్నింటిలోను జగన్ పార్టీ వారు ఉన్నారన్నారు.
జగన్ ఇప్పటికే మెంటల్ అయ్యాడని, ఆ మెంటల్ కేసును ఆసుపత్రిలో చేర్పించాలని అచ్చెన్నాయుడు అన్నారు. లేదంటే గంట సేపటి తర్వాత ఆయన మెంటల్ మాకు వచ్చేలా ఉందన్నారు.
నేరం గురించి అడిగి ఫోటో తీసుకోవాలా: చంద్రబాబు
మనం హుందాతనం కోల్పోవద్దని, సభ్యులంతా సంయమనం కోల్పోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సమైక్య ఏపీలో నేను ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నానని, కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన సందర్భాలు లేవన్నారు. కానీ ఇప్పుడు వైసిపి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
వైసిపి నేతలు బండబుతులు తిట్టారని మండిపడ్డారు. వారి బాడీ లాంగ్వేజ్ భయంకరంగా ఉందన్నారు. మనం నాగరిక ప్రపంచంలోనే ఉన్నామని, అందరం సంయమనం పాటించాలని చంద్రబాబుకు కోరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి, విజయ భాస్కర రెడ్డి, జనార్ధన్ రెడ్డి వంటి హేమాహేమీలు ఉన్నటువంటి సమయంలో మేం మాట జారినా, వాటిని వెనక్కి తీసుకొని సభ హుందాతనం కాపాడామన్నారు. ఇప్పుడు మాత్రం వైసిపి దారుణంగా వ్యవహరిస్తోందన్నారు.
మేం ప్రకటన చేశాక... మేం చెప్పిన దాంట్లో తప్పులు ఉంటే మీరు లేవనెత్తారన్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారన్నారు. కానీ మేం సభను జరగనివ్వమంటే ఎలా అన్నారు. జగన్ మాట్లాడితే మాత్రమే హద్దులో ఉంటారని, అధికార పక్షం నుంచి ఎవరు మాట్లాడినా ఆందోళన చేయడం బాధాకరమన్నారు.
సీఎం స్థానం వద్దకు వచ్చి గొడవ చేస్తారా అని మండిపడ్డారు. కాల్ మనీ బాధితులను రక్షించాలన్న చిత్తశుద్ధి విపక్షానికి లేదన్నారు. యనమల రామకృష్ణ ఎప్పుడు కూడా ఆవేశానికి లోనైన సందర్భం లేదన్నారు. ప్రతిపక్షం మాట్లాడిన రికార్డులన్నీ ఉన్నాయన్నారు.
నేను ఎవరితోనో ఫోటోలు తీసుకుంటే దానిని పట్టుకొని రాద్దాంతం చేయడం విడ్డూరమన్నారు. బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా ఫోటోలు తీసుకోవడం సహజమే అన్నారు. ఎవరైనా ఫోటో కోసం వస్తే నేరం చేస్తావా అని ఫోటో తీయించుకోవాలా అని ప్రశ్నించారు.
ప్రతిపక్షం ఏం అడిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధమన్నారు. మా సమాధానం పట్ల సంతృప్తి లేకుంటే మీరు ఏం చేయాలో అది చేసుకోవచ్చన్నారు. మీరు మాట్లాడే మాటలకు మా వాళ్లు కూడా ఆవేశానికి లోనవుతున్నారన్నారు. మనిషి అన్నప్పుడు కొంచెం రోషం ఉంటుందని, కానీ ఇలాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు మనం హుందాగా వ్యవహరించాలన్నారు. ఇది మనకు తప్పదని టిడిపి సభ్యులను ఉద్దేశించి అన్నారు.