ఏపీలో 6వేలకుపైగా కరోనా కొత్త కేసులు, చిత్తూరులో వెయ్యికిపైగా, 35వేలు దాటిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 6వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలతోపాటు ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,962 నమూనాలను పరీక్షించగా.. 6,096 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 6వేలకుపైగా కరోనా కొత్త కేసులు
తాజాగా నమోదైన 6096 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,48,231కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 20 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మరణించారు. కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున బాధితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,373కి చేరింది.
ఏపీలో భారీగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2194 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,05,266కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో కూడా భారీ పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 35,592 యాక్టివ్ కేసులున్నాయి.
చిత్తూరు, కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,56,06,163 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1024, తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరులో 735 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పశ్చిమగోదావరి, కడప జిల్లా మినహా 12 జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 313, చిత్తూరులో 1024, తూర్పుగోదావరిలో 750, గుంటూరులో 735, కడపలో 243, కృష్ణాలో 246, కర్నూలులో 550, నెల్లూరులో 354, ప్రకాశంలో 491, శ్రీకాకుళంలో 534, విశాఖపట్నంలో 489, విజయనగరంలో 299, పశ్చిమగోదావరిలో 68 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోరినవెంటనే కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రానికి పంపిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.