టిడిపి ప్రతిష్టకు మరో దెబ్బ...అనుబంధ ఎంఎల్ఏ అక్రమ మైన్స్ సీజ్
ప్రకాశం జిల్లా: టిడిపి ప్రజాప్రతినిధులకు సంబంధించి అనేక అవినీతి వ్యవహారాలు వెలుగు చూస్తున్న నేపధ్యంలో తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ కు సంబంధించిన అక్రమ క్వారీలు ఆరింటిని అధికారులు ఒకేసారి సీజ్ చేశారు.
ఆమంచి కృష్ణమోహన్ ఇసుక క్వారీ తవ్వకాల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించిన అధికారులు ఇప్పటికి 6 మైన్స్ ను సీజ్ చెయ్యగా, మరోవైపు ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.
చీరాల నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తదనంతరం టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే...ఆమంచి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే అవినీతి ఆరోపణలతో ఎదుర్కోవడంతో పాటు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే ఆమంచిపై, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చే అవినీతి ఆరోపణల్లో ప్రధానమైనవి ఇసుక అక్రమ దందాలకు సంబంధించినవి కావడం గమనార్హం. ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పలు ఇసుక క్వారీలను అక్రమంగా మైనింగ్ చేసుకుంటున్నారంటూ చాలా కాలం నుంచి తీవ్రమైన ఆరోపణలున్నాఅటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకోలేదు.
అయితే టిడిపిలో చేరినప్పటి నుంచి ఇసుక అక్రమ దందాలో ఆమంచి ఇంకా రెచ్చిపోయారని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ క్వారీయింగ్ లో చెలరేగిపోతున్నారని ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. ఇలా ఆరోపిస్తున్న వారిలో తెలుగుదేశంపార్టీలో ఉన్న ఆమంచి ప్రత్యర్ధులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారట. దీంతో అధికారులు ఆమంచి అక్రమ మైనింగ్ పై దృష్టిపెట్టక తప్పలేదట. బుధవారం నుంచి ఆమంచికి సంబంధించిన అక్రమ మైన్స్ పై దాడులు మొదలు పెట్టిన అధికారులు ఆయా క్వారీల్లో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు గుర్తించారట. దీంతో ఇలా అక్రమాలు గుర్తించిన ప్రకాశం జిల్లాలోని కడవకుదురులో 2 క్వారీలు, పందిళ్ళపల్లిలో ఉన్న 4 క్వారీలను సీజ్ చేశారని సమాచారం.