కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురు మృతి,10మందికి తీవ్ర గాయాలు
కర్నూలు:జిల్లాలోని ఆలూరు మండలం పెద్ద హోతూరులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఒక లారీ ఆగివున్న టాటాఏస్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. వీరంతా ఎల్లార్తి దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకే వీరంతా కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు మృతులను కర్నూలు పాతబస్తీకి చెందిన షేక్ ఖాజా, హుస్సేన్, హనీఫ్, ఫాతిమా, హస్రా, షేక్ మెహక్గా గుర్తించారు.
మరోవైపు హోతూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.