ఏపీలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు- ఒక్కరోజే ఆరుగురు బాధితుల గుర్తింపు..
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వ్యాప్తి జరుగుతుండగా.. ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా కరోనా వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. స్టేజ్-3గా పిలిచే కొలిడ్ కేసుల బారిన పడిన వారి సంఖ్య ఇవాళ్టికి 19కి చేరింది. ఇవాళ ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు ఇప్పటికే బాధితులుగా ఉన్న వారి నుంచి సోకినవి కాగా. మరో మూడు కొత్తగా నమోదయ్యాయి.
ఏపీలో కరోనా విజృంభణ..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన విదేశీ ప్రయాణికుల నుంచి స్ధానికులకు సోకుతుందని గుర్తించగా.. తాజాగా దేశీయంగా ప్రయాణాలు చేసిన వారి నుంచి కూడా ఇతరులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఇవాళ ఒక్కరోజే ఏపీలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి ఇప్పటివరకూ ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.
నాలుగు జిల్లాల్లో ఆరు కేసులు..
ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు ఈ నెల 13న ఢిల్లీ వెళ్లి అక్కడ స్ధానిక మసీదుల్లో నాలుగు రోజుల పాటు ఉన్నాడు. తర్వాత 18న విజయవాడ తిరిగి వచ్చాడు. అక్కడి నుంచి 19న తిరిగి చీరాలకు చేరుకున్న సదరు వృద్ధుడికి ఈ నెల 26న కరోనా లక్షణాలు బయటపడ్డాయి. పరీక్షల అనంతరం ఇవాళ పాజిటివ్ గా నిర్ధారించారు. ఇతనితో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో వారిని కూడా క్వారంంటైన కు పంపారు.
అలాగే 19వ తేదీన ఢిల్లీ వెళ్లిన గుంటూరుకు చెందిన వ్యక్తితో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇప్పటికే కరోనా పాజిటివ్ గుర్తించగా.. ఇవాళ మరో ఇద్దరికి కూడా పాజిటివ్ గా తేలింది. దీంతో ఈ ఒక్క కుటుంబంలోనే నలుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరోవైపు ఈ నెల 9వ తేదీన మక్కా యాత్ర నుంచి హైదరాబాద్ చేరుకున్న కృష్ణాజిల్లాకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి 27వ తేదీన కరోనా లక్షణాలు బయటపడ్డాయి. పరీక్షల తర్వాత ఇవాళ కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇదే కోవలో ఈ నెల 18న రాజస్ధాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు.. కర్నూలు, కడప జిల్లాల్లో తిరిగిన తర్వాత 24న ఆస్పత్రిలో చేరగా.. ఇవాళ కరోనా పాజిటివ్ గా తేలింది.
స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి ప్రవేశం..
ఇప్పటివరకూ విదేశీ ప్రయాణికులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన క్రమంలో స్టేజ్ 1, వారి నుంచి స్ధానికులకు సోకి స్టేజ్ 2 పూర్తి చేసుకున్న కరోనా భూతం.. ఇప్పుడు దేశీయంగా ఒకరి నుంచి మరొకరికి సోకడం మొదలు కావడంతో స్టేజ్ 3కి చేరినట్లయింది. ఇది మరింత ప్రమాదకరంగా వైద్య నిపుణులు ఇప్పటికే తేల్చారు. ఇవాళ మొత్తం 74 శాంపిల్స్ పరీక్షించగా.. వీటిలో ఆరు పాజిటివ్ గా తేలగా... మిగతా 68 మందికి నెగెటివ్ వచ్చింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్దితి నెలకొంది.