ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్నంటే..? క్షీణిస్తున్న యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,311 నమూనాలను పరీక్షించగా.. 60 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,959కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
గత 24 గంటల్లో కరోనాతో ఎవరూ కూడా మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7163 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 140 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,81,181కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 615 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,35,89,373 కరోనా నమూనాలను పరీక్షించారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 1, చిత్తూరులో 16, తూర్పుగోదావరిలో 6, గుంటూరులో 7, కృష్ణాలో 10, నెల్లూరులో 3, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 7, పశ్చిమగోదావరి 8 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
దేశంలోనూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,15,664 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9121 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.09 కోట్లకు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 81 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,55,813కు చేరింది. కాగా, సోమవారం ఒక్కరోజే 11,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.06 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,36,872 యాక్టివ్ కేసులున్నాయి.