విజయవాడలో 60 శాతం లాక్డౌన్, కరోనా కేసులు తగ్గకపోవడంతో కలెక్టర్ కీలక నిర్ణయం
కరోనా వైరస్ కేసులు తగ్గడం అంటూ లేనే లేదు. అన్లాక్ 1.0తో మాల్స్, రెస్టారెంట్లు కూడా బార్ల తెరిచారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరం విజయవాడలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో 60 శాతం లాక్ డౌన్ విధిస్తామని పేర్కొన్నారు. దీంతో వైరస్ కేసులను తగ్గించొచ్చు అని ఆయన భావిస్తున్నారు.
విజయవాడలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో 42 జోన్లను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. నగరంలో 64 డివిజన్లు ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు కంటైన్మెంట్ జోన్లలో కూడా వర్తిస్తాయని కలెక్టర్ తెలిపారు. అక్కడ ఉంటున్న ప్రజలు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లు మెడికల్, రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 216 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ సోకి ఇద్దరు చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 147 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 69 మంది ఉన్నారు. కరోనా వైరస్ మొత్తం కేసుల సంఖ్య 3 వేల 990కి చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 77కి చేరింది. ప్రస్తుతం 1510 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైరస్ తగ్గడంతో 2403 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం సెంచరీ మార్క్ తగ్గడం లేదు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.