లోటస్పాండ్లో 60 గదులు-పేదలకు సెంటు భూమా- జగన్ సర్కారుపై టీడీపీ ఫైర్
ఏపీలో ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు ప్రభుత్వం పంచుతున్న ఇళ్ల స్ధలాల వ్యవహారం మరో రచ్చ రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం పేదలకు సెంటు భూమి మాత్రమే ఇవ్వడాన్ని విపక్ష టీడీపీ తప్పుబడుతోంది. సెంటు భూమిలో పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై విశాఖ టీడీపీ నేత బండారు సత్యన్నారాయణ మూర్తి సీఎం జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సీఎం జగన్ తాను లోటస్పాండ్లో 60 గదులు కట్టుకుని పేదలకు కేవలం సెంటు భూమిలో ఇళ్లు కట్టుకోవాలని చెప్పడం సరికాదని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యన్నారాయణ మూర్తి అన్నారు. పేదల ఇళ్ల స్ధలాల పేరుతో ప్రభుత్వం రూ.7 వేల కోట్లు దోపిడీ చేసిందన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని బండారు విమర్శించారు. ఇళ్ల పట్టాలపై జరిగిన అవినీతిపై మంత్రి బొత్స చర్చకు రావాలన్నారు. తన ఆరోపణలు అవాస్తవమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన్నారు.
ఏపీలో ఇళ్ల పట్టాల విషయంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలని టీడీపీ నేత బండారు సత్యన్నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆయన కోరారు. ఇళ్ల పట్టాల విషయంలో జరుగుతున్న అవినీతిని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారని బండారు ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను ప్రధాని మోడీ మెచ్చుకున్నారని, మేం ఇచ్చిన ఇళ్లకు అన్నిఆధారాలున్నాయన్నారు.