సెకండ్ షో వెళ్లొచ్చాకే.. అసలు ఆట స్టార్ట్: జాలిపడ్డా!.. అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు
రాజమండ్రి: చూడటానికి అతనో వృద్ధుడు. కానీ ఈ వయసులోనూ దొంగ తనాలు చేయడంలో ఘనుడు. 40ఏళ్లుగా దొంగతనాలు చేసినవాడు.. వృద్ధాప్యంలోను అదే దారిలో సాగుతున్నాడు.
ఇప్పటికీ చాలాసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చిన అతను.. మరోసారి పోలీసులకు చిక్కాడు. ఆ వృద్ధుడి పేరు యద్దనపూడి అరుల్ల్ మరియరాజు. నెల్లూరు దుర్గామెట్ట ప్రాంతానికి చెందిన ఇతను ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాడు.
మొదటి చోరీ:
27 ఏళ్ల వయసులో స్నేహితుడితో కలిసి మొదటిసారిగా చోరీకి పాల్పడ్డాడు అరుల్ మరియరాజు. ఆ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక కూడా ప్రవర్తన మార్చుకోలేదు సరికదా.. మరిన్ని దొంగ తనాలకు పాల్పడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు.
సెకండ్ షో వెళ్లొచ్చి:
దొంగతనం చేయాలనుకున్న రోజు సెకండ్ షో సినిమాకు వెళ్లడం మరియరాజుకు అలవాటు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాళం వేసి ఉన్న ఇంటి కోసం గాలిస్తాడు. ఆపై ఇంట్లో చోరీ చేసి అక్కడినుంచి పరారవుతాడు.
చోరీ చేసిన సొత్తును విక్రయించి విజయవాడలో తన పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేస్తాడు. ఆ డబ్బు అయిపోయే దాకా జల్సా చేసి మళ్లీ చోరీకి సిద్దమైపోతాడు. గత 40ఏళ్లుగా ఇలాంటి దొంగతనాలెన్నో చేశాడు. జైలుకెళ్లడం, లేదంటే బెయిల్ పై బయటకు రావడం ఇతనికి పరిపాటిగా మారిపోయింది.
మళ్లీ ఇలా చిక్కాడు:
ఈ ఏడాది జనవరిలో విజయవాడ త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో గైట్ కళాశాల ఉద్యోగి ఇంట్లో చోరీ చేశాడు. ఇటీవల డ్రగ్ ఇన్స్పెక్టరు ఇంట్లో, మరో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున నగదు, బంగారం ఎత్తుకెళ్లాడు. త్రీ టౌన్ పోలీసులు రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో వారికి చిక్కాడు. తమను చూసి తప్పించుకునే ప్రయత్నంలో కాలికి గాయమై ఓ ఖాళీ ప్రదేశంలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు.
జాలిపడ్డారు కానీ:
వృద్ధుడు కావడం అప్పటికే అతడి కాలికి గాయం కూడా కావడంతో పోలీసులు జాలి పడ్డారు. కానీ ఆ తర్వాత అతని నేరాల చిట్టా తెలుసుకుని అవాక్కయ్యారు. రాజమండ్రి వచ్చిన ప్రతీసారి లాడ్జిలో ఉంటూ నేరాలు చేస్తున్నట్లు నిందితుడు మరియరాజు ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.7.80 లక్షల నగదు, 210 గ్రాముల బంగారం మొత్తం రూ.15.16 లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకోవడం గమనార్హం.