కాల్మనీ: '600 ఫిర్యాదులు, బెజవాడలో నేర చరిత్ర మారాలి'
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంపై ఈరోజు వరకు 600 ఫిర్యాదులు అందాయని విజయవాడ సీపీ గౌతం సవాంగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదులను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.
ఇప్పటికే కొంత మంది ఈ కేసులో అదుపులోకి తీసుకున్నామని చెప్పిన ఆయన మిగతా కాల్మనీ నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాల్మనీ వ్యవహారం చేస్తోన్న వ్యాపారస్తుల ఆర్థిక మూలాలపై ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.
ప్రజల మద్దతు లభిస్తేనే కాల్మనీ తరహా నేరగాళ్లపై చర్యలు సాధ్యమని అన్నారు. విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మరింతగా నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నిఘా వ్యవస్థ, టాస్క్ఫోర్స్ను మరింతగా బలోపేతం చేస్తామన్నారు.
విజయవాడలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వివరించిన ఆయన బెజవాడలో నేర చరిత్ర మారాలని అన్నారు. కాగా, గుడివాడలో కాల్ మనీ వ్యాపారి కొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. 59 పాస్ బుక్కులు, 83 ఏటీఎం కార్డులు, 6 స్టాంపు పేపర్లు సీజ్ చేశారు.